TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కలిసి ఉంటే కలదు సుఖము..గవర్నర్

Published on: Mon Oct 6, 2014 7:56AM

 

కలిసి ఉంటే కలదు సుఖము... అని పెద్దలే కాదు రెండు రాష్ట్రాలకు పెద్దన్న వంటి గవర్నర్ నరసింహన్ కూడా ఇద్దరు ముఖ్యమంత్రులకు మరోమారు నచ్చచెప్పే ప్రయత్నం చేసారు. బీజేపీ నేత బండారు దత్తాత్రేయ నిర్వహించిన 'అలాయ్ బలాయ్' కార్యక్రమానికి హాజరయిన గవర్నరుతో బాటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పార్టీలకతీతంగా రాజకీయ నాయకులందరినీ ఒక్క వేదిక మీదకు తీసుకువచ్చే ఈ కార్యక్రమాన్ని గత పదేళ్లుగా నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయను అభినందించారు. తెలుగు ప్రజలు అందరూ అన్నదమ్ములులా కలిసి మెలిసి జీవిస్తూ. ఒకరికొకరు సహకరించుకొంటేనే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు.

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందిస్తూ, ‘రాష్ట్రాలు వేరయినా తెలుగుజాతి ఒకటేనని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తను కోరుకొంటున్నానని, రెండు రాష్ట్రాలలో తెదేపా ఉన్నందున ఆ పార్టీ అధ్యక్షుడిగా రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తను కోరుకొంటున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఆలింగనం చేసుకోవడం హైలైట్ గా నిలిచింది.