TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

త‌మిళిసై పీఆర్వోగా బీజేపీ లీడ‌ర్‌!.. గ‌వర్న‌ర్ తీరుపై గ‌రంగ‌రం!

Published on: Sat Apr 23, 2022 1:53PM

తెలంగాణ గవర్నర్ తమిళిసై చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయా? లేక ఆమె స్వయంగా వివాదాలను ఆహ్వానిస్తున్నారా తెలియడం లేదని పరిశీలకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమె  తాను వివాదాస్పదురాలిని కాననీ పదే పదే చెప్పుకుంటున్నా...ఒక దాని తరువాత ఒకటిగా వివాదాలు ఆమెను చుట్టుముడుతున్నాయి. తాజాగా ఆమె పీఆర్వోను నియమించుకున్న ఉదంతం మరో వివాదంగా మారింది. ఆమె తన పీఆర్వోగా నియమించుకున్న వ్యక్తి తమిళనాడు బీజేపీ పీఆర్వో కావడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. తెలంగాణ గవర్నర్ గానే కాకుండా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న తమిళిసై తన ప్రజా సంబంధాల అధికారిగా తమిళనాడుకు చెందిన వ్యక్తిని నియమించుకున్నారు. సదరు వ్యక్తి  తమిళనాడు బీజేపీకి పీఆర్వ్వోగా వ్యవహరిస్తున్నారు. 
దీంతో  ఇప్పటికే తమిళిసై పై, ఆమె వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న తెరాస విమర్శలపర్వానికి తెర తీశారు. పీజీ మెడికల్ సీట్ల బ్లాక్, రాష్ట్రంలో తల్లీ కుమారుడి ఆత్మహత్య వంటి అంశాలపై ఆమె ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా చేసి వ్యాఖ్యలతో అసలే అంతంత మాత్రంగా ఉన్న ప్రభుత్వం- రాజ్ భవన్ సంబంధాలు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో తమిళిసై పీఆర్వో వ్యవహారం వెలుగులోకి రావడంతో విమర్శలకు  తెరాసకుపదునైన ఆయుధం దొరికినట్లైంది. 
సాంకేతికంగా గవర్నర్ తమిళిసై పీఆర్వో బీజేపీకి చెందిన వ్యక్తి అవ్వడం నిబంధనలకు వ్యతిరేకం కాకపోయినప్పటికీ, నైతికంగా పార్టీలతో సంబంధం లేని వ్యక్తిని అటువంటి విధులలో చేర్చుకోవడం విధాయకమని పరిశీలకులు అంటున్నారు. అయితే తెరాసతో గవర్నర్ సంబంధాలు ఉప్పు-నిప్పుగా మారిన తరుణంలో తమిళిసై సహజంగానే సాంకేతిక అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.  రాష్ట్రంలో శాంతి భద్రతల అశం నుంచి....మెడికల్ సీట్ల కేటాయింపు వరకూ, నియామకాల నుంచి నీటి వరకూ ప్రతి అంశంపైనా ఆరా తీస్తున్నారు. ప్రతి అంశంపైనా తనదైన శైలలో అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఆ అభిప్రాయాలన్నీ దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవిగానే ఉంటున్నాయి.
త్వరలోనే రాష్ట్ర గవర్నర్ మార్పు ఉంటుందన్న వార్తలు వినవస్తున్నాయి. ఈ వార్తలు ప్రచారంలోనికి వచ్చిన తరువాత తమిళిసై తన దూకుడును మరింత పెంచారు. రానున్న రోజులలో తమిళిసై పీఆర్వో అంశం మరింతగా రాజ్ భవన్- ప్రభుత్వం మధ్యా దూరం పెంచేందుకు దోహదపడే అవకాశాలు కనిపిస్తున్నాయనడంలో సందేహం లేదు.