టీడీపీలో చేరిన గౌరు ఫ్యామిలీ.. మూడు టికెట్లకు హామీ

 

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని సీఎం స్వగృహం ప్రజావేదికలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు గౌరు దంపతులను పార్టీలోకి ఆహ్వానించారు. గౌరు దంపతులతో పాటు పలువురు కీలక నాయకులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గౌరు దంపతులు, నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డితో పాటు ముఖ్య నాయకులతో చంద్రబాబు భేటీ అయ్యారు. పాణ్యం టికెట్‌ గౌరు చరితకు ఇస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఇదే సమయంలో నంద్యాల ఎంపీ టికెట్‌పై చర్చించినట్లు తెలిసింది. గౌరు వెంకటరెడ్డి స్వయాన బావ, నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డికి ఎంపీ టికెట్‌ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. టికెట్‌పై స్పష్టత ఇచ్చినా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అందరు నాయకులతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుందామని సీఎం అన్నట్లు సమాచారం. అదేవిధంగా నందికొట్కూరు నియోజకవర్గం నుంచి బలమైన అభ్యర్థిని ఎంపిక చేయాలని గౌరు దంపతులకే అవకాశం ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా గౌరు కుటుంబానికి పాణ్యం, నందికొట్కూరు అసెంబ్లీ స్థానాలతో పాటు నంద్యాల ఎంపీ టికెట్‌పై స్పష్టత ఇచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం.