TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో పారిశ్రామిక రంగానికి స్వర్ణయుగం.. ఒకే నెలలో 2లక్షల కోట్ల పెట్టుబడులు

Published on: Sat May 9, 2026 11:01AM

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం వాయువేగంతో  పురోగమిస్తోంది. కేవలం నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐబీపీ) ఆమోదం తెలిపిందంటేనే.. చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక రంగానికి ఇది స్వర్ణయుగమని అర్థమౌతుంది.  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత..  రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. నెలరోజులలోనే రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం నిజంగా చారిత్రాత్మకమని చెప్పవచ్చు.  అనుమతి పొందిన ప్రాజెక్టుల వివరాలిలా ఉన్నాయి. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడితో విశాఖపట్నంలో అడుగుపెట్టింది. దాదాపు లక్ష కోట్ల రూపాయలకు పైగా ఇన్వెస్ట్ చేస్తోంది.  ఈ ప్రాజెక్టు  1.5 గిగావాట్ సామర్థ్యంతో కూడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్. దీనికి అనుబంధంగా  విద్యుత్ కోసం శ్రీ సత్యసాయి జిల్లాలో 51 వేల 300 కోట్ల రూపాయల వ్యయంతో  సోలార్ విద్యుత్ కేంద్రం, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ను కూడా రిలయన్స్ ఏర్పాటు చేయనుంది.

ఇక రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న  అమరావతి  ' క్వాంటం వ్యాలీ.. టెక్నాలజీ రంగంలో ఏపీని ప్రపంచ పటంలో నిలబెట్టేలా అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ప్రారంభమైంది. గత నెల 14న అంటే ప్రపంచ క్వాంటం దినోత్సవం సందర్భంగా  దేశంలోనే తొలి  క్వాంటం కంప్యూటర్ టెస్టింగ్ ఫెసిలిటీ  అమరావతిలో  ప్రారంభమైంది. ఇది  రక్షణ, ఆరోగ్యం, సెమీకండక్టర్ రంగాల్లో  కీలకమైన పరిశోధనలకు వేదిక కానుంది.

 ఇక సత్యవేడులో  రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారీ కేంద్రం. తమిళనాడు వెలుపల రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మొట్టమొదటి భారీ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. 2 వేల508 కోట్ల పెట్టుబడితో 5 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా ఈ ప్లాంట్ ఏర్పాటౌతోంది. తిరపతి జిల్లా సత్యవేడులో దాదాపు 267 ఏకరాలలో ఈ ప్లాంట్ ఏర్పాటు కానుంది.  
 శ్రీ సత్యసాయి జిల్లా  ప్రాంతం  డిఫెన్స్ హబ్‌గా మారబోతోంది. దేశ స్వదేశీ యుద్ధ విమానం ఏఎంసీఏ  టెస్టింగ్, ఇంటిగ్రేషన్ కేంద్రాన్ని పుట్టపర్తిలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 350 ఎకరాలు కేటాయించింది. డీఆర్డీఏ ఈ కేంద్రం కోసం లక్ష కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయనుంది

అలాగే గ్రీన్ ఎనర్జీ రంగంలో అగ్రగామి సంస్థ  రెన్యూ భారీ సోలార్ ఇంగోట్-వాఫర్ ఫెసిలిటీని రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది.  6.5 గిగావాట్ల సోలార్ ప్యానెల్ తయారీ సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ ప్లాంట్  : ఏపీని గ్రీన్ హైడ్రోజన్, సోలార్ ఎనర్జీ కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ఏర్పాటు అవుతోంది.  

  ప్రముఖ ఏసీ తయారీ సంస్థ  కారియర్' తిరుపతి సమీపంలో తన యూనిట్‌ను విస్తరించనుంది. అలాగే అపోలో టైర్స్ శ్రీ సిటీలో ఆరువేల ఒక వంద కోట్ల రూపాయలతో కొత్త తయారీ యూనిట్‌ నెలకొల్పనుంది. 

ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో సుమారు 39 వేల మందికి పైగా  నేరుగా ఉద్యోగాలు లభిస్తాయి. ఇక పరోక్షంగా లక్ష మందికి పైగా  ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి.  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మంత్రంతో ప్రభుత్వం అనుమతులను వేగవంతం చేయడంతో.. ఐటి నుండి ఆటోమొబైల్ వరకు అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. ఒకే నెలలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం ఏపీ పారిశ్రామిక ప్రస్థానంలో ఒక నూతన శకానికి ఆరంభంగా చెప్పవచ్చు.  అమరావతి క్వాంటం హబ్‌గా, విశాఖ డేటా హబ్‌గా, రాయలసీమ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా రూపుదిద్దుకుంటున్నాయి. ఇలా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ప్రగతి పరుగులు తీస్తోంది.