TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మత విద్వేషాల‌కంటే మాన‌వ‌త్వం అవ‌స‌రం.. భ‌విష్య‌వాణి

Published on: Mon Jul 18, 2022 1:15PM

అంతా స్వార్ధ‌మే రాజ్యం చేస్తోంది. త‌మ అధికారం, త‌మ వారి బాగోగులు, త‌మ భూములు  త‌ప్ప ప్ర‌జ‌ల్ని పాలకులు త‌మ బిడ్డ‌లుగా చూసుకోవ‌డంలేద‌ని ఉజ్జ‌యినీ మ‌హాకాళి ఆగ్ర‌హించింది. సికింద్రాబాద్‌ ఉజ్జ యినీ మహాకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతర సందర్భంగా రెండోరోజు సోమవారం రంగం  కార్యక్రమం  నిర్వ హించారు. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి  వినిపించారు. 

కేంద్ర‌, రాష్ట్ర‌ప్రభుత్వాలు త‌మ అధికార దాహంతో ఒక‌రిపై మ‌రొక‌రు ఆధిప‌త్య‌పోరులో ప్ర‌జ‌ల్ని, మ‌త సామర‌స్యాన్ని నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌న్న‌ది మాతంగి స్వ‌ర్ణ‌ల‌త భ‌విష్య‌వాణి గూడార్ధం కావ‌చ్చు. ప్ర‌భుత్వాలు  ప్ర‌జాసంక్షేమానికి పాటుప‌డాలిగాని, ప్ర‌జ‌ల మ‌ధ్య‌, ముఖ్యంగా మ‌తాల‌మ‌ధ్య చిచ్చుపెడుతూ, త‌మ అవ‌స రాల‌కు మ‌తాన్ని, కులాల‌ను వాడుకుంటూ దేశ భిన్న‌త్వంలో ఏక‌త్వ భావ‌న‌ను దెబ్బ‌తీసేలా వ్య‌వహ‌రిం చ డం రాజ్య‌కాంక్షే త‌ప్ప ప్ర‌జాసంక్షేమానికి ప్రాధాన్య‌నీయ‌డం ఎలా అవుతుంది? 

దేశంలో అరాచ‌కం రాజ్యమేలుతోంది. ప్ర‌జ‌ల‌కు ధ‌న‌, మాన ర‌క్ష‌ణ క‌రువైపోతోంది. ప్ర‌తీ రంగాన్ని రాజ కీయ కేంద్రాలుగా మార్చి త‌మ ఆదేశాలు, మాట చెల్లుబాటు చేసుకోవ‌డంలోనే పాల‌కులు దృష్టి పెట్ట‌డం స‌మాజానికి చేటుగా మాతంగి చూచాయిగా ప్ర‌క‌టించారు. సామాజిక అంశాల్లో ప్ర‌జ‌ల‌కు, మ‌రీ ముఖ్యంగా సామాన్యుల‌కు ఏ మేరకు మేలు జ‌రుగుతున్న‌దీ ప‌రిశీలించుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది. న్యాయం, పోలీసు వ్య‌వ‌స్థ‌, విద్యా,ఆరోగ్య రంగాల‌న్నీ రాజ‌కీయ రంగు పులుముకుంటున్న ఈ రోజుల్లో సామాన్యుల‌కు స‌మ‌న్యాయం ద‌క్కేలా ప్రభుత్వాలేవీ త‌గిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. చ‌ట్టాలు, కోర్టులు స‌మ‌స్తం రాజ‌కీయ నాయ‌కుల క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తున్నాయి. ఈ కార‌ణంగానే అక్ర‌మాల‌కు, అన్యాయా ల‌కు బ‌లైపోతున్నావారి సంఖ్య పెరుగుతోందే గాని, న్యాయం కోసం కోర్టు మెట్లెక్కుతున్న‌వారికి నిజంగా న్యాయం జ‌ర‌గ‌డం లేదు. అన్నింటా మొక్క‌బ‌డిగానే సాగిపోతోంది గాని న్యాయ‌ప‌రంగా ప్ర‌జా సంక్షేమానికి పాటుప‌డుతున్న దాఖ‌లాలు క‌న‌ప‌డ‌టం లేదు. 

మ‌హిళ‌లు, పిల్ల‌ల ఆరోగ్యం, ర‌క్ష‌ణ  అంశాల్లో ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్య వైఖ‌రి అనేక సంద‌ర్భాలు స్ప‌ష్టం చేస్తు న్నాయి. దేశంలో దాదాపు అన్నిప్రాంతాల్లోనూ  మ‌హిళ‌ల దాడులు, అవ‌మానాలు మితిమీరిపో తుండ‌డం దేశానికి చేటు అని మాతంగి ఆగ్ర‌హాం తెలియ‌జేస్తుంది. రాజ‌కీయాల‌కు ఇస్తున్న ప్రధాన్య‌త సామాజిక న్యాయానికి ఇవ్వ‌డంలేదు. పార్టీలు, నాయ‌కులు, అధికారం చేజిక్కించుకోవాల‌న్న పోరాటాల్లో త‌ల‌మున క‌లై మాన‌వత్వం, భారీ భార‌త బంగారు భ‌విత‌కు కృషి త‌ల‌పెట్ట‌డంలో వెనుకంజ‌లోనే వుండిపోతున్నారు. పిల్ల‌లు, యువ‌త అంద‌రూ రాజ‌కీయ విభేదాల మురుగులో భ‌విష్య‌త్తు ప‌ట్ల భ‌యాందోళ‌న‌తోనే కాలం వెళ్ల‌దీయ‌డం దారుణం. ఈ భ‌యాందోళ‌నల నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడ‌వ‌ల‌సిన బాధ్య‌త నిజంగానే నాయ‌కులు తీసుకోవాల్సిన అవ‌స‌రం వుంద‌న్న‌ది మాతంగి వాక్కు సారాంశం.