TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గిల్ కెప్టెన్స్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

Published on: Sun May 10, 2026 7:08AM

ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో శనివారం ( మే 9) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. రాజస్థాన్ రాయల్స్‌ను 77 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 84 పరుగులు, సాయి సుదర్శన్ 55 పరుగులు అర్ధసెంచరీలతో రాణించారు.  దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక బౌలింగ్ లో రషీద్ ఖాన్33 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్ పతనాన్ని శాశించాడు.  

 మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ పవర్‌ప్లేలో దూకుడుగా ఆడి రాజస్థాన్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఆ తరువాత సుదర్శన్ ఔటైనా, గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోరు అందించాడు.

230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కూడా దూకుడుగానే ఛేదన ప్రారంభించింది.  ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ  16 బంతుల్లో 36 పరుగులు, ధ్రువ్ జురెల్  10 బంతుల్లో 24  మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి రాజస్థాన్ 3 వికెట్లకు 78 పరుగులతో పటిష్టంగానే కనిపించింది.

అయితే, స్పిన్నర్లు బౌలింగ్‌కు దిగడంతో మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. రషీద్ ఖాన్ తన మాయాజాలంతో రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. ప్రమాదకరంగా మారుతున్న జురెల్‌ను, ఆ తర్వాత ఫెరీరా, శుభమ్ దూబేలను స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేర్చాడు. చివర్లో రవీంద్ర జడేజా  38 పరుగులు చేసి  ఒంటరి పోరాటం చేసినా ప్రయోజనం లేకపోయింది. గుజరాత్ బౌలర్లలో  జాసన్ హోల్డర్  3 వికెట్లు తీశాడు. రాజస్థాన్ 16.3 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ అయింది.