జగన్ పై గిడ్డి ఈశ్వరి ఫైర్... దిగజారుడు రాజకీయాలు..

 

రాజకీయాలు చూస్తుంటే ఒక్కోసారి ఆశ్చర్యపోవాల్సిందే. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి భజన చేయడం... ప్రతిపక్ష పార్టీని తిట్టిపోయడం కామన్ గా జరుగుతుంటాయి. నిన్న మొన్నటి వరకూ వైసీపీ పార్టీలో ఉన్న గిడ్డి ఈశ్వరిని చూస్తుంటే... అదే అనిపిస్తుంది. వైసీపీ పార్టీలో ఉన్నన్ని రోజులు టీడీపీ పై ఒక రేంజ్ లో విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అదే టీడీపీ పార్టీలో చేరారు. ఇంకేముంది ఇప్పుడు జగన్ వంతు వచ్చింది. జగన్‌ది డబ్బు సంస్కృతని, డబ్బులతో రాజకీయం చేయవచ్చనేది జగన్ ఆలోచన అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోట్లున్న వారికే సీట్లు ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారని, కోట్లకు సీట్లు అమ్ముకునే సంస్కృతి చివరికి ఆయనను విషనాగై కాటేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని..ఎమ్మెల్యేగా ఉండి కూడా ప్రజలకు ఏమీ చేయలేకపోయానని ఈశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో ఉండగా సీఎం, మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలతో ఎవరితోనూ మాట్లాడకూడదనే ఆంక్షలు ఉండేవన్నారు. జగన్ చెప్పినట్టే చేయాల్సి వచ్చేదని అన్నారు. జగన్ వల్ల అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేకపోయామని, ఇప్పుడు వస్తున్నందుకు ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జగన్ తనను గెంటేస్తే, చంద్రబాబు తనను ఆదరించారని అన్నారు. ఏది ఏమైనా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అన్నది మరోసారి నిజమైంది.