TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జాబ్ బోర్ కొట్టిందని.. 100 మందిని చంపిన నర్స్

Published on: Fri Nov 10, 2017 4:47PM

ఏళ్లుగా ఒకే పని చేస్తే ఎవరికైనా బోర్ కొడుతుంది. ఏం జీవితం రా బాబు.. అని తలబాదుకుంటాం. ఒక్కొసారి ఇది పరిధి దాటిపోయి ఉన్మాదానికి దారి తీస్తుంది. అలా ఒక ఉన్మాదిలా మారిన ఒక నర్స్ కథే ఇది. కుల, మత, వర్ణ బేధాలు లేకుండా అందరికీ సేవ చేసే పవిత్రమైన వృత్తి నర్స్. అలాంటి ఆ వృత్తికే కళంకం తెచ్చింది ఆ నర్స్.. తన అసహనమంతా అమాయకులైన రోగులపై ప్రదర్శించింది. అలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 106 మంది రోగులను చంపేసింది. జర్మనీలోని డెల్మెన్‌హోస్ట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే నీల్స్ హోగెల్ 2015లో ఓ ఇద్దరు రోగులపై హత్యాయత్నానికి పాల్పడటంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

 

అయితే ఈమె మరిన్ని హత్యలకు పాల్పడిందని ఆరోపణలు రావడంతో దర్యాప్తు జరిపిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఆమె మొత్తం 90 మంది రోగులను హతమార్చినట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో న్యాయస్థానం ఆమెకు జీవితకాల జైలు శిక్ష విధించింది. అయితే ఈమె పనిచేసిన ఆసుపత్రుల్లో చికిత్స తీసుకొని అనుమానాస్పద స్థితిలో మరణించిన మృతుల కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.. దీంతో మరోసారి కోర్టు అనుమతి తీసుకొని విచారణ చేపట్టిన పోలీసులు 1999-2005 మధ్యకాలంలో.. నీల్స్ పనిచేసిన రెండు ఆసుపత్రుల్లో వందలాది రికార్డులను పరిశీలించిన పోలీసులు మరో 16 మందిని కూడా చంపినట్లు తేల్చారు.

 

రోగులను చంపేందుకు ఆమె ఏం చేసేదో తెలుసా..? ఎవరికి అనుమానం రాకుండా వారికి ప్రాణాంతక మందులను ఇంజెక్ట్ చేసేది. 2005లోనే ఓ రోగికి ప్రాణంతక మందులను ఇంజెక్ట్ చేస్తుండగా ఓ నర్సు గుర్తించడంతో మొదటిసారి నీల్స్ అరెస్ట్ అయ్యింది. ఇందుకు న్యాయస్థానం ఏడున్నర సంవత్సరాల జైలు శిక్షను విధించింది. శిక్షా కాలంలో ఆమె ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు.. జైలు నుంచి విడుదలయ్యాకా కూడా ఆమె రోగుల ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉంది. ఇదంతా ఎందుకు చేశావని న్యాయమూర్తి ఆమెను అడగ్గా.. వైద్యం చేయడంలో విసుగు చెందే చంపినట్లు నీల్స్ నేరాన్ని అంగీకరించింది.