TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గౌరీ ‌హత్య చుట్టూ "కుల" రాజకీయాలు

Published on: Thu Sep 7, 2017 3:58PM

ఎవరు చేశారో..? ఎందుకు చేశారో..? తెలియదు కానీ గౌరీ లంకేష్ హత్య కన్నడ నాట సంచలనం కలిగించింది. తమకు వ్యతిరేకంగా కథనాలు వెలువరించారనే అక్కసుతోనే గౌరీని చంపి ఉంటారని అంతా భావిస్తూ వచ్చారు. మీడియా కూడా ఇదే బేస్ చుట్టూ కథనాలు వండి వార్చింది. కానీ ఆమె హత్య ప్రధాన రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. మరో తొమ్మిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు..వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకోవాలని కాంగ్రెస్..గతంలో కోల్పోయిన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని బీజేపీ ఇప్పటి నుంచే వ్యూహాలు రెడీ చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో గౌరీ లంకేష్ హత్య కన్నడ రాజకీయాలను ఒక కుదుపు కుదిపింది.. పార్టీలు ఉలిక్కిపడ్డాయి..ఇంతటి కలవరానికి కారణం ఆమె తన పత్రికలో సంచలన కథనాలు ప్రచురించారనో..లేకో మరోకటో కాదూ..ఆమె కులమే అగ్రనేతలను భయపెడుతోంది.

 

కర్ణాటకలో లింగాయత్ సామాజిక వర్గం అండదండలు ఉన్న వారికే అధికారమని దశాబ్ధాలుగా రుజువు అవుతూ వస్తుంది. రాజకీయ ప్రాబల్యశక్తిగా బలపడిన లింగాయత్‌లకు రాష్ట్రంలోని 224 అసెంబ్లీ సీట్లలో 110 స్థానాల ఫలితాలను ప్రభావితం చేయగల సత్తా ఉంది. ఆ మధ్య బీజేపీకి అలక వహించి కాంగ్రెస్‌కు దగ్గరైన ఆ కులస్తులు తిరిగి కమలానికి దగ్గరవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హత్యకు గురైన గౌరీ లంకేష్ కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వారు కావడమే అసలు సమస్య. ఆ కులానికి చెందిన ఓట్లు కాషాయం చెంతకు చెరకుండా చేసేందుకు..లింగాయత్ వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేసేందుకే రాజకీయ ప్రత్యర్థులు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

 

గడచిన రెండు సంవత్సరాల కాలంలో దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లకు చెందిన 12 మందిని దారుణంగా హత్య చేశారు. వీరిలో అత్యధికులు లింగాయత్ వర్గం వారే. ఈ క్రమంలో వారి మద్ధతును కూడగట్టేందుకు పార్టీలు రంగంలోకి దిగాయి. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీయే ఈ దారుణాలు చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ దక్షిణ కన్నడ జిల్లాలో మెగా ర్యాలీకి పిలుపునివ్వగా..కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఢిల్లీ స్థాయిలో ప్లాన్ చేసుకుంటున్నారు..లెఫ్ట్ సహకారంతో జనంలోకి వెళ్లి..గౌరీ లంకేష్ హత్యపై ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేయాలని కసరత్తు చేస్తోంది కాంగ్రెస్. మరీ ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాయో వేచి చూడాలి.