క‌రోనాకు కొమ్ములొచ్చాయి! రూపు మార్చుకొని బ‌ల‌హీన‌ప‌డింది!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్‌-19 వైరస్‌ భారత్‌కు వచ్చేసరికి దాని రూపు మార్చుకుని బలహీనపడి తోక మూడిచిందని ప్రముఖ గ్యాస్ట్రొ ఎంటరాలజిస్ట్‌ డా.డి.నాగేశ్వరరెడ్డి చెప్పారు. చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ వైరస్‌.. అక్కడ బలపడి యూరప్‌ దేశాలకు విస్తరించిందని, అప్పటికే మ్యుటేషన్‌ (రూపాంతరం) చెంది ఇటలీలో బీభత్సం సృష్టించిందని ఆయ‌న తెలిపారు. ఆ తర్వాత మెల్లగా స్పెయిన్, ఫ్రాన్స్‌ దేశాల్లో విస్తరించాక, ఇండియాకు చేరిందన్నారు. అయితే ఆసియా దేశాలకు వచ్చేసరికి మరోసారి మ్యుటేషన్‌ చెంది వైరస్‌ బలహీన పడిందని చెప్పారు.

ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రొ ఎంటరాలజీ అధినేత డా.డి.నాగేశ్వరరెడ్డి వైరస్‌ గురించి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు వెల్ల‌డించారు.

వుహాన్‌ నుంచి ఇటలీకి వైరస్‌ చాలా ప్రాథమిక దశలోనే వెళ్లింది. మొత్తం మూడు మ్యుటేషన్‌లు జరిగినట్టు మనకు పరిశోధనల్లో తేలింది. ఇటలీకి వెళ్లిన సమయంలో జరిగిన మ్యుటేషన్‌ బలంగా ఉంది. అందుకే ఎక్కువ ప్రభావం చూపించింది. ఈ మ్యుటేషన్లలో 3 అమైన్‌ యాసిడ్స్‌ మారాయి. మన దేశానికి వచ్చిన వైరస్‌కూ.. వుహాన్‌లో మొదలైన వైరస్‌కు తేడా వుందని ఆయ‌న చెప్పారు.

 

 

మన దేశంలో వచ్చిన వైరస్‌ మ్యుటేషన్‌కూ, ఇటలీ వైరస్‌ మ్యుటేషన్‌కూ తేడా ఉంది. మన దేశంలోకి వచ్చే సరికి సైక్‌ మ్యుటేషన్‌ అంటే కొమ్ములు పెరిగిన వైరస్‌ వచ్చింది. దీన్ని బట్టి మన దగ్గరున్న వైరస్‌ ఇటలీలో ఉన్న వైరస్‌ కంటే బాగా బలహీన పడింది. ఈ కొమ్ములు బాగా ఉన్న వైరస్‌ మన శరీరంలోని కణాలతో అల్లుకుపోవడం (ఇంటరాక్షన్‌) చాలా తక్కువగా ఉంటుంది. ఈ వైరస్‌ వల్ల మనకు జరిగే నష్టం చాలా తక్కువని డా.డి.నాగేశ్వరరెడ్డి తెలిపారు.