వల్లభనేని వంశీ అరెస్టు
Published on: Thu Feb 13, 2025 7:13AM

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో వల్లభనేని వంశీని అరెస్టు చేసిన పోలీసులు ఆయనను విజయవాడ తరలిస్తున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో నిందితుడైన వల్లభనేని వంశీని ఆ కేసులో కాకుండా సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు తనను కులం పేరుతో దూషించి, కార్యాలయంపై దాడి చేశారంటూ ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ఆ తరువాత ఈ కేసుకూ తనకూ ఎటువంటి సంబంధం లేదనీ చెప్పారు. సత్యవర్ధన్ తెలుగుదేశం కార్యాలయంలో డీటీపీ ఆపరేటర్ గా పని చేసిన సత్యవర్ధన్ ఈ కేసుతో తనకు సంబంధం లేదంటూ కోర్టులో అఫడవిట్ కూడా దాఖలు చేయడంతో ఈ కేసు వీగిపోయినట్లేనని అంతా భావించారు.
అయితే పోలీసులు సత్యవర్ధన్ ను విచారించి..వల్లభనేని వంశీ ఆయనను కిడ్నాప్ చేసి బెదరించినట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో పోలీసులు వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. హైదరాబాద్ లో అరెస్టు చేసిన పోలీసులు ఆయనను విజయవాడ తరలిస్తున్నారు. వల్లభనేని వంశీని గన్నవరం పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గన్నవరం పోలీసు స్టేషన్ పై దాడి కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిలు పిటిషన్ పై ఈ నెల 20న తీర్పు వెలువడనుంది. అయితే ఇప్పుడు వంశీని ఆ కేసులో కాకుండా కిడ్నాప్ కేసులో అరెస్టు చేశారు.


