ఇక దాదా పొలిటికల్ ఇన్నింగ్స్..బీసీసీఐ అధ్యక్ష పదవికి గుడ్ బై!
Published on: Thu Jun 2, 2022 6:37AM
ఇండియన్ క్రికెటర్ లో అత్యంత దూకుడు ప్రదర్శించిన కెప్టెన్ గా గుర్తింపు పొందిన గంగూలీ ఇక పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. ఇంత కాలం క్రికెట్ కు సేవ చేశాననీ, ఇక దానిని చాలించి ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇక తాను ప్రజాసేవకే అంకితమవ్వాలని భావిస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఆయన బీజేపీతో కలసి తన రాజకీయ జీవితం ప్రారంభించనున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే పలు మార్లు ఆయన బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. గంగూలీ భార్య కూడా తన భర్త బీజేపీ గూటికి చేరే అవకాశాలున్నాయని పేర్కొన్న నేపథ్యంలో గంగూలీ కొత్త ఇన్నింగ్స్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
టీమ్ ఇండియా కెప్టెన్ గా జట్టులో పోరాట స్ఫూర్తిని నింపిన గంగూలీ జట్టును యువరక్తంతో నింపేశారు. క్రికెట్ లో ఆస్ట్రేలియా స్లెడ్జింగ్ గురించి, మైండ్ గేమ్ గురించి క్రీడాభిమానులందరికీ తెలిసిందే. అటువంటి ఆస్ట్రేలియా స్లెడ్జింగ్ ను ఎదుర్కొనడమే కాకుండా, తిరిగి అంతే దూకుడుగా బదులిచ్చిన గంగూలీ దూకుడును క్రికెటర్లందరూ అప్పట్లో ప్రశంసించారు. మొదటి నుంచీ కూడా గంగూలీకి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
గంగూలీ బీసీసీఐ చీఫ్ కావడానికి అమిత్ షా సహకరించారని అంటారు. కాగా గంగూలీ రాజీనామా వార్తలను బీసీసీఐ ఖండించింది. అధికారికంగా రాజీనామా చేయనప్పటికీ, బీసీసీఐ నుంచి గంగూలీ బయటకు రావడం లాంఛనమేనని గంగూలీ సన్నిహితులు చెబుతున్నారు. గంగూలీ ప్రవేశంతో బెంగాల్ ల బీజేపీకి కొత్త జోష్ వస్తుందని బీజేపీ భావిస్తోంది.


