లండన్ లో గాంధీ విగ్రహానికి అపచారం
Published on: Tue Sep 30, 2025 1:22PM

భారత జాతి పిత మహాత్మా గాంధీ విగ్రహానికి లండన్ లో అపచారం జరిగింది. లండన్ లోని టావిస్టాక్ స్క్వేర్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని గుర్తు తెలియనివ్యక్తులు ధ్వంసం చేసేశారు. జాతిపిత కాంస్య విగ్రహం పునాదిని పగలగొట్టారు. అక్కడితో ఆగకుండా విగ్రహం దిమ్మపై భారత వ్యతిరేక నినాదాలు రాశారు. సరిగ్గా మరో రెండు రోజులలో జాతి పిత జయంతి ఉండగా, గాంధీ జయంతిని ప్రపంచమంతా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకోనున్న తరుణంగా గాంధీ విగ్రహం ధ్వంసం సంఘటన సంచలనం సృష్టించింది.
ఇది కేవలం గాంధీ విగ్రహంపై దాడి మాత్రమే కాదనీ, ఆయన అహింసా సిద్ధాంతంపై దాడనీ అంటున్నారు. కాగా లండన్ లో గాంధీ విగ్రహం ధ్వంసం ఘటనపై భారత్ హైకమిషన్ స్పందించింది. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. ఇలా ఉండగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


