నా ఆస్తులు తిరిగివ్వండి...గాలి డిమాండ్ !

 

2007లో గనుల అక్రమాల విషయంలో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి భారీగా మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్, బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో నిన్న ఉదయం 11 గంటల నుండి ఈ విచారణ ప్రారంభమైంది. 

ఈ విచారణ ముగిశాక మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కేసులో ఈడీ జప్తు చేసిన ఆస్తులన్నింటినీ తిరిగిచ్చేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించిందని, అయితే ఆ తీర్పుపై ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసిందని తెలిపారు. ఈ కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ జప్తు చేసిన తన ఆస్తులన్నీ తిరిగిచ్చేయాలని కోరారు గాలి జనార్దన్‌రెడ్డి. కర్ణాటక హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించినా రూ.వెయ్యికోట్ల విలువైన తన ఆస్తులను తిరిగిచ్చేందుకు ఈడీ జాప్యం చేస్తోందని గాలి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. 

వీలైనంత త్వరగా తన ఆస్తులపు అప్పగించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఆయన ఈడీని హెచ్చరించారు. తాను విచారణ కోసం రాలేదని, తన ఆస్తులు అప్పగించాలని ఈడీని కోరేందుకు వచ్చానని ఆయన పేర్కొన్నారు. తన సహాయకుడు అలీఖాన్‌తో కలిసి ఖరీదైన కారులో జనార్ధన్ రెడ్డి రాగా ఆయనకు రక్షణగా ఓ పోలీసు వాహనం కూడా వచ్చింది. సుమారు ఐదు గంటల తర్వాత ఆయన ఈడీ ఆఫీసు నుంచి తిరిగి వెళ్లిపోయారు.