TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సోషల్ మీడియా ఖాతాలకు నిధులెక్కడివి... పోలీసుల ప్రశ్నలతో పిల్ల సజ్జల ఉక్కిరిబిక్కిరి

Published on: Tue Apr 28, 2026 10:45AM

వైసీపీ సోషల్ మీడియా విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోషల్ మీడియా వేదికగా జరిగిన దాడులు, అసభ్యకర పోస్టుల వెనుక ఉన్న ఆర్థిక మూలాల గురించి పోలీసులు సజ్జల భార్గవ్‌రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు. ముఖ్యంగా ఈ కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుండి వచ్చాయి? ఈ నెట్‌వర్క్‌ను నడపడానికి ఎవరెవరు సహకరించారు? అనే కోణంలో దర్యాప్తు సాగింది.  విచారణ సమయంలో పోలీసులు ముఖ్యంగా నిధుల వ్యవహారంపై ఆరా తీశారు. సోషల్ మీడియా వింగ్ నడపడానికి భారీ మొత్తంలో ఖర్చవుతుందని, ఆ నిధులను ఎవరు సమకూర్చారనేది ఇప్పుడు కేసులో కీలకంగా మారింది. 

ఏ1 నిందితుడు వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భార్గవ్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే విచారణకు సజ్జల భార్గవ్ రెడ్డి సహకరించలేదనీ, చాలా ప్రశ్నలకు ఆయన  తెలియదు, గుర్తులేదు' అని సమాధానమిచ్చినట్లు సమాచారం.ఈ కేసులో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే..  నిందితులు వాడిన పరికరాల గురించి పోలీసులు అడిగిన ప్రశ్నలు. పోస్టులు పెట్టడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను అప్పగించాలని పోలీసులు కోరగా..  భార్గవ్‌రెడ్డి   నిరాకరించినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాలు ఉంటేనే వాటిని ఇస్తానని ఆయన స్పష్టం చేశారని అంటున్నారు.

రాజకీయ నేతలను, ముఖ్యంగా మహిళా నేతలను లక్ష్యంగా చేసుకుని చేసిన అసభ్యకర పోస్టుల వెనుక ఎవరి ప్రోద్బలం ఉందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. షర్మిల, విజయమ్మ వంటి వారిపై జరిగిన వ్యక్తిగత దాడుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించేందుకు పోలీసులు సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ఈ పోస్టుల తయారీ మరియు వ్యాప్తి కోసం ప్రత్యేక టీమ్‌లు పనిచేశాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

గతంలో అన్నమయ్య ప్రాజెక్ట్ వంటి సున్నితమైన అంశాలపై కూడా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసుల దర్యాప్తు కేవలం పోస్టులకే పరిమితం కాకుండా, ఆ వ్యవస్థ వెనుక ఉన్న ఆర్థిక వనరులపై కూడా ఫోకస్ పెట్టింది. తదుపరి విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి భార్గవ్‌రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు, తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ కేసులో మరికొంత మంది వైసీపీ నేతలకు కూడా నోటీసులు అందే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.