సీఎం జగన్ కీలక నిర్ణయం.. వలస కూలీల కోసం ఉచిత బస్సులు

వలస కూలీలకు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై సమీక్షా సమావేం నిర్వహించిన ఆయన.. మండుటెండలో పిల్లా, పాపలతో కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలపై ఉదారత చూపాలన్నారు. రాష్ట్రం గుండా వెళ్తున్న వలస కూలీలు కోసం బస్సులు సిద్ధం చేయాలన్నారు. నడిచివెళ్తూ ఎక్కడ తారసపడ్డా వారిని బస్సులు ఎక్కించి.. రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లాలన్నారు. అలాగే, ఇదివరకు ఆదేశించిన విధంగా వారికి భోజనాలు, త్రాగు నీరు ఏర్పాటు చేయాలన్నారు. ప్రోటోకాల్స్‌ పాటిస్తూ నడిపే బస్సుల్లో వలస కూలీలకు 15 రోజుల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని సీఎం పేర్కొన్నారు.