టీడీపీలోకి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే చేరిక

 

ఏపీలో ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో అధికార పార్టీ టీడీపీలోకి భారీ చేరికలు ఉండే అవకాశాలున్నాయని కొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. త్వరలో టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ పలువురి నేతల పేర్లు వినిపించాయి. వారిలో మంగళగిరి మాజీ కాంగ్రెస్ శాసనసభ్యురాలు కాండ్రు కమల పేరు కూడా వినిపించింది. ఊహించినట్టే ఆమె టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. చంద్రబాబు సమక్షంలో ఈరోజు సాయంత్రం టీడీపీలో చేరనున్నారు.

పట్టణ, రూరల్ పరిధిలో ఉన్న తన అనుచరులతో, పలు పార్టీల నుంచి వచ్చే కార్యకర్తల తో కలిసి చంద్రబాబు సమక్షంలో కమల టీడీపీ కండువా కప్పుకోనున్నారు. మంగళగిరి పట్టణంలో సీతారమ కోవేల నుంచి తన అనుచరులతో కలసి భారీ ర్యాలీ గా పట్టణంలోని గౌతమబుద్ద రోడ్డు మీదుగా తాడేపల్లి కరకట్టపై సీఎం నివాసం వరకు భారీ సంఖ్యలో వాహనాలతో వెళ్ళి.. తన అనుచరులతో పాటు టీడీపీలో చేరనున్నారు.