మాజీ మంత్రి  విడదల రజనీ ముఖ్య అనుచరుడు అరెస్ట్ 

posted on: Nov 18, 2024 4:06PM

గత వైసీపీ  ప్రభుత్వ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది.  మాజీ మంత్రి విడదల రజిని ముఖ్య అనుచరుడు, వైఎస్సార్సీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డి ఏకంగా ప్రభుత్వ భూమిని కాజేసాడు. ఈ నేపథ్యంలో కోటిరెడ్డిపై కేసు నమోదైంది.  నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు  కోటిరెడ్డిని అరెస్టు చేశారు. నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన కోటిరెడ్డి  ఇక్కడితో ఆగలేదు. ఒకే స్థలాన్ని ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేశాడు. మరొకరికి దీన్ని అక్రమంగా  డబుల్ రిజిస్ట్రేషన్‌ చేయించాడని, వాణిజ్య దుకాణాలు నిర్మించి అద్దెకు ఇచ్చారని గ్రామస్థులు ప్రజా వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని విచారించేందుకు రెండ్రోజుల క్రితం గ్రామానికి వచ్చిన ఎంపీడీవో స్వరూపరాణిని, ఫిర్యాదుదారు, టీడీపీ స్థానిక నేత భవనం శ్రీనివాసరెడ్డిని కోటిరెడ్డి నానా బూతులు తిట్టాడు. దౌర్జన్యంగా వ్యవహరించాడు.
 తనను కోటిరెడ్డి కులం పేరుతో అసభ్యంగా దూషించి కొట్టాడని ఎంపీడీవో నాదెండ్ల పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేసి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఏజేసీజే న్యాయస్థానంలో ఆదివారం హాజరుపరచగా జడ్జి నిందితుడికి రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...