TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వెల్లంపల్లికి అసమ్మతి పొగ.. రాజుకుంటున్న వ్యతిరేక సెగ

Published on: Mon May 30, 2022 12:20PM

జగన్ పార్టీ పరిస్థితి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వరకూ ఒకెత్తు.. ఆ తరువాత మరొక ఎత్తు అన్నట్లు తయారైందన్నది రాజకీయ పండితుల పరిశీలన. అంటే పార్టీ బలపడిందని కాదు.. పార్టీ ప్రతిష్ట దిగజారే  వేగం పెరిగిందని వారు విశ్లేషిస్తున్నారు. ఒక్కొక్కటిగా మంత్రుల నియోజకవర్గాలలో పరిస్థితిని గమనిస్తే ఆ సంగతి స్పష్టమౌతుందని వారు చెబుతున్నారు.

విజయవాడ పశ్చిమ నియోజవకర్గం సంగతే తీసుకుంటే గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించి మంత్రి పదవి చేపట్టిన వెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీలోనే కాదు, నియోజకవర్గంలో కూడా ఏకాకిగా మారారు. సొంత వర్గీయులు కూడా దూరం జరిగి ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గత ఎన్నికలలో బొటాబొటీ మెజారిటీతో విజయం సాధించిన వెల్లంపల్లి మంత్రిగా అందులోనూ ప్రభుత్వంలో పలుకుబడి మెండుగా కలిగిన నేతగా నియోజకవర్గంలో మూడేళ్ల పాటు చక్రం తిప్పారు.

ఆ క్రమంలో తన నోటి దురుసుతో, దుందుడుకు వ్యవహార శైలితో ప్రజలలోనే కాకుండా, సొంత పార్టీ క్యాడరల్ లోనూ వ్యతిరేకత మూటగట్టుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన హయాంలో దేవాలయాలలో చోరీలు, విగ్రహాల ధ్వసం వంటికి జరిగాయి. అంతర్వేదిలో రథం దగ్ధం సంఘటన తరువాత ఆయన ప్రతిష్ట బాగా దిగజారింది. ఆలయాలపై దాడులు, చోరీల ఘటనలను నివారించడంలో.. వాటికి కారకులను పట్టుకుని శిక్షించడంలో ప్రభుత్వ వైఫల్యం ప్రభావం ఆయనపై జన బాహుల్యంలో ప్రతికూలత ను పెంచింది.  

ఊరు మంచిదైతే నోరు మంచిది అవుతుందంటారు. జగన్ సర్కార్ తొలి కేబినెట్ మంత్రులలో కొడాలి నాని, పేర్ని నానిల తరువాత విపక్షంపై నోరేసుకు పడిపోయే మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ గుర్తింపు పొందారు. విపక్షంపై ఆయన దూకుడు కారణంగానే విజయవాడలో ఆయనేం చెబితే అదే నడిచేది. బెజవాడ కార్పొరేషన్ వైసీపీ గెలుచుకోవడానికి ఆయనే కారణమన్న బిల్డప్ ఉంది. అందుకే మేయర్ పదవి వెల్లంపల్లి  సామాజిక వర్గానికే చెందిన రాయన భాగ్యలక్ష్మికి ఆయన సిఫారసుపైనే దక్కిందని అప్పట్లో  పార్టీ వర్గాలే కాదు ఆయనే స్వయంగా చెప్పుకున్నారు.  అలాగే బెజవాడ కకన దుర్గమ్మ గుడి చైర్మన్ పదవి కూడా ఆయన సామాజిక వర్గానికే చెందిన పైలా సోమినాయుడిని వరించడంలో కూడా తన పాత్రే ఉందని వెల్లంపల్లి చెప్పుకున్నారు.  మంత్రిగా ఉన్నంత కాలం వెలిగిపోయిన ఆయన ప్రభ మాజీ కాగానే మసక బారింది. మంత్రిగా ఉన్నంత కాలం ఆయన వర్గీయులుగా ముద్ర పడిన వారంతా కారణాలేమైనా ఇప్పుడాయనకు దూరం జరిగారు.

మంత్రిగానూ, మాజీ మంత్రిగానూ కూడా ఆయనే పెత్తనం చెలాయిస్తానంటే కుదరదంటూ ఎదురు తిరుగుతున్నారు. అంతేనా వెల్లంపల్లి తీరుపై అసంతృప్తితో కార్పొరేటర్లు రాజీనామా హెచ్చరికలు చేస్తున్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో ఆయన దాదాపు ఏకాకిగా మారిపోయారని చెప్పుకోవచ్చు.  ఈ నేపథ్యంలోనే ఆయన గత ఎన్నికలలో విజయం సాధించినా, మరో సారి గెలిచే పరిస్థితి ఉందా అన్న చర్చ పార్టీ వర్గాలలోనే బయలు దేరింది. గత ఎన్నికలలో ఆయను 58 వేల ఓట్లు వస్తే, ఆయన ప్రత్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి అయిన ఖలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్ కు 50 వేల ఓట్లు వచ్చాయి. ఇదే నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా రంగంలో నిలిచిన పోతిన మహేష్ కు ఇరవై రెండు వేల ఓట్లు వచ్చాయి.

ఇప్పుడు తెలుగుదేశం, జనసేన పొత్త ఉంటుందని భావిస్తున్న తరుణంలో నియోజకవర్గంలో వ్యతిరేకత మూటగట్టుకున్న వెల్లంపల్లి శ్రినివాస్ కు టికెట్ ఇచ్చే సాహసానికి జగన్ ఒడికట్టరని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.   దీంతో ఈ మాజీ నియోజకవర్గంలో పట్టు కోసం తనను వ్యతిరేకిస్తున్న వైసీపీ క్యాడర్ ను, నాయకులను మచ్చిక చేసుకోవడానికి చెమటోడుస్తున్నారట. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కూడా అయిన వెల్లంపల్లి నియోజకవర్గంలో నేతల మధ్య సమన్వయం సాధించడం అటుంచి, తనపై పార్టీ క్యాడర్ లో ఉన్న వ్యతిరేకతను అధిగమించేందుకే సమయం అంతా కేటాయిస్తున్నారని పార్టీ వర్గాలు సెటైర్లు వేసుకుంటున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పార్టీకి సమయం కేటాయించడం లేదనీ, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ మరింత బలహీన పడుతుందనీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.