టీడీపీకి ఊహించని షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి!!

 

ప్రస్తుతం టీడీపీ టైం అస్సలు బాగాలేనట్లుంది. అసలే ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన టీడీపీకి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగిలేలా ఉన్నాయి. గెలిచిందే కొందరు నాయకులంటే.. ఆ కొందరిలో కూడా ఒకరిద్దరు పార్టీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు టీడీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు బీజేపీలో చేరడానికి సిద్దమవుతున్నారంటూ వార్తలొస్తున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి  కూడా చేరిపోయారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కడప లోక్ సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి చేతిలో 3 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఆదినారాయణ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి పార్టీ మారుతారని వార్తలు వస్తున్నాయి. బీజేపీకిలో వెళ్లాలంటూ.. అనుచురులు ఆదినారాయణపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆదినారాయణ కూడా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే.. బీజేపీలోకి వెళ్లాలని ఆదినారాయణ రెడ్డిపై ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తున్నారట. దీంతో ఆదినారాణరెడ్డి సైతం ఈ విషయంలో గట్టిగానే ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇక తనకెంతో పట్టున్న జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో సైతం వైసీపీ అభ్యర్థి విజయం సాధించడం, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలనూ వైసీపీ గెలవడంతో ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరేందుకు చూస్తున్నారని తెలుస్తోంది.