బీజేపీ దేశ భక్తి ఇదేనా.. ఈశ్వరప్పా జాతీయ జెండాను కాషాయం చేస్తావా?!
Published on: Tue May 31, 2022 3:58PM
దేశ భక్తి పేటెంట్లు బీజేపీవే అన్నట్లుగా ఆ పార్టీ నేతల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకూ ఛాతిని 56 అంగులాలు పొంగించి మరీ చెప్పుకుంటుంటారు. బీజేపీని విమర్శించడమే దేశ ద్రోహం అన్నట్లుగా బిల్డప్ లు ఇస్తుంటారు. ఆ క్రమంలో కొందరు బీజేపీ నేతలు, సాధ్విలు, మహరాజ్ లు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో ద్వేష భావాన్ని పెంపొందించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. గాడ్సే జయంతులు నిర్వహించడం నుంచి మూక దాడులు, హత్యల వరకూ దేశ భక్తి మాటున దర్జాగా చెలామణి అయిపోయాయి.
జాతీయ జెండాకూ, కాషాయ జెండాకూ తేడా మరచిపోయే వరకూ ఆ దేశ భక్తి పూనకం పెచ్చరిల్లిపోయింది. తాజాగా కర్నాటక మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈశ్వరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీని ఇరకాటంలో పెట్టేశాయి. కాషాయం త్యాగానికి చిహ్నం అని అభివర్ణిస్తూ భవిష్యత్ లో కాషాయ జెండాయే జాతీయ పతాకం అవ్వడం ఖాయమని సెలవిచ్చారు. ఏదో ఆవేశంలో ఆయనా మాట అన్నారని అనుకోవడానికి, అనుకుని ఏదో మాట్లాడేశారులే అని వదిలేయడానికి వీల్లేకుండా కాషాయ జెండాకు వేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉందంటూ చెప్పుకొచ్చారు. అదే సమయంలో వాళ్లు చెప్పారు కనుకనే త్రివర్ణ పతాకం జాతీయ జెండా అయ్యిందని పనిలో పనిగా కాంగ్రెస్ పై రుసరుసలాడారు.
ఇప్పటికైతే మువ్వన్నెల పతాకం జాతీయ జెండా కనుక ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాం.. కానీ భవిష్యత్ లో కాషాయ జెండాయే మన జాతీయ పతాకం అవ్వడం ఖాయమని ఈశ్వరప్ప అన్నారు. ఈశ్వరప్ప వ్యాఖ్యలపై దేశం ఒక్కసారిగా భగ్గు మంది. బీజేపీ దేశ భక్తి ముసుకు తొలగిపోయిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంఘపరివార్ రహస్య అజెండాను దేశంలో అమలు చేయడమే బీజేపీ రాజకీయ అజెండా అని ఈశ్వరప్ప వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయంటూ పలు రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. దేశ భక్తి ముసుగులో మోడీ సర్కార్ ఇంత కాలం అమలు చేస్తున్నది హిందుత్వ అజెండా అనడానికి ఈశ్వరప్ప మాటలే తిరుగులేని నిదర్శనమంటూ ప్రజాస్వామ్య వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాషాయ జెండాయే భవిష్యత్ జాతీయ పతాకం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈశ్వరప్ప మామూలోడు కాదు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొని అనివార్యంగా కర్నాటక పంచాయతీరాజ్ గ్రామీణాబివృద్ధి మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంట్రాక్టర్ ఆత్మహత్యతో ఈయన అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. మంత్రి ఈశ్వరప్ప బిల్లుల చెల్లింపునకు 40 శాతం కమిషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపించిన కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ కొద్ది రోజుల కిందట ఉడిపీలోని ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. కాంట్రాక్టర్ ఆత్మహత్యకు సంబంధించి పోలీసు కేసు నమోదైంది. మంత్రి ఒత్తిడి కారణంగా కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక సమాచారం మేరకు నిర్ధారించారు.
గ్రామీణాభివృద్ధి,పంచాయత్ రాజ్ శాఖలో చేసిన రూ. 4 కోట్ల విలువైన పనులకు బిల్లును క్లియర్ చేయడానికి మంత్రి సహచరులు 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారని తన సూసైడ్ లోట్ లో పాటిల్ ఆరోపించారు. తన మరణానికి ఈశ్వరప్పే కారణమని విస్పష్టంగా పేర్కొన్నాడు. సూసైడ్ నోట్ అధారంగా పోలీసుల ఆయన ఫై కేసు నమోదు చేశారు. విపక్షాలు ఈశ్వరప్ప రాజీనామాను డిమాండ్ చేసినా ఆయన ససేమిరా అనే అన్నారు. అయితే ఆందోళనలు ఉధృతం కావడంతో అనివార్యంగా మంత్రి పదవికి రాజీనామా చేశారు.
అవినీతి ఆరోపణలపై కేబినెట్ పదవికి రాజీనామా చేసిన ఈశ్వరప్పపై బీజేపీ అధిష్టానం ఇప్పటి వరకూ వేటు వేయలేదు. పైపైచ్చు వెనుకేసుకు వస్తోంది. ఈ తరుణంలో అయన జాతీయ జెండాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్టను మసకబార్చేవిగా ఉన్నాయి. కాగా జాతీయ జెండాపై ఈశ్వరప్ వ్యాఖ్యలపై సుమోటో ఆయనపై దేశద్రోహ నేరం కేసు నమోదు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, జాతీయ జెండాపై ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ హై కమాండ్ వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. మొత్తం మీద ఈశ్వరప్ప వ్యాఖ్యలు బీజేపీని ఇరకాటంలో పడేశాయని పరిశీలకులు అంటున్నారు.


