దేశం కోసమే బీజేపీలో చేరాను...

 

మన దేశంలోని రాజకీయ నాయకులలో దేశభక్తి కలవాళ్ళు ఇప్పటికీ చాలామంది వుండటం మన అదృష్టం. అలాగే దేశం కోసం పార్టీ మారే నాయకులు కూడా వుండటం మన భరతమాత సౌభాగ్యం. ఇప్పుడు అలాంటి దేశభక్తుల కోవలోకి మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి కూడా చేరారు. డీజీపీగా రిటైరైన తర్వాత వైసీపీలో చేరిన ఆయన మొన్నటి ఎన్నికలలో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన తాజాగా బీజేపీ అధ్యక్షుడు హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. తాను బీజేపీలో ఎందుకు చేరారో దినేష్ రెడ్డి వివరిస్తూ, ‘‘దేశ సౌభాగ్యం కోసం, దేశ ప్రగతి కోసం భారతీయ జనతా పార్టీలో చేరాను. వైసీపీ ప్రాంతీయ పార్టీ కావడం వల్ల దాన్ని వదిలిపెట్టేశాను. బీజేపీ జాతీయ పార్టీ కావడం వల్ల జాతీయ దృక్పథంతో అందులో చేరాను’’ అన్నారు. ఏది ఏమైనప్పటికీ దినేష్‌రెడ్డి లాంటి దేశభక్తులున్న మన దేశం చాలా గొప్పది.