బీజేపీలో చేరిన గౌతమ్ గంభీర్
posted on Mar 22, 2019 1:07PM
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బీజేపీలో చేరతారని, ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరిగింది. మరోవైపు గంభీర్ను ఢిల్లీలోని ఓ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తున్నట్లు ఢిల్లీకి చెందిన ఓ సీనియర్ బీజేపీ నేత ప్రకటించారు. దీంతో గంభీర్ త్వరలో బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా గంభీర్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్జైట్లీ సమక్షంలో గంభీర్ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వం నచ్చి తాను బీజేపీలో చేరుతున్నానని, బీజేపీలో చేరడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.