వాసుదేవ దీక్షితులు కన్నుమూత

 

ప్రముఖ జర్నలిస్ట్‌ వాసుదేవ దీక్షితులు కన్నుమూశారు. ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా వాసుదేవ దీక్షితులు పనిచేశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం మరణించారు. 76 సంవత్సరాల వయస్సు ఉన్న ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు మధ్యాహ్నం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. కాసేపట్లో ఆయన భౌతిక కాయాన్ని సికింద్రాబాద్ కల్యాణపురిలోని స్వగృహానికి తరలించనున్నారు. రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

1942లో జన్మించిన వాసుదేవ దీక్షితులు బీఎస్సీ పూర్తిచేశారు. 1967లో ఆంధ్రప్రభ దినపత్రికలో జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన దీక్షితులు.. 1967 నుంచి 1999 వరకు సబ్‌ఎడిటర్‌ స్థాయి నుంచి ఎడిటర్‌ వరకు అనేక హోదాల్లో పనిచేశారు. జర్నలిజం రంగానికి ఆయన అందించిన సేవలకు గాను మద్రాసు తెలుగు అకాడమీ ఖాసా సుబ్బారావు అవార్డుతో సత్కరించింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా వాసుదేవ దీక్షితులును ప్రభుత్వం నియమించింది.