వరద విలయం.. కొట్టుకుపోయిన అమర్ నాథ్ యాత్రికుల గుడారాలు.. భారీగా ప్రాణనష్టం
Published on: Sat Jul 9, 2022 10:50AM
ఈ వరద ఉధృతికి 50కి మంది పైగా గల్లంతయ్యారు. పాతిక మంది మరణించారు. మృతులు, గల్లంతైన వారు అత్యధికులు యాత్రికులేనని చెబుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయకచర్యలు చేపట్టారు. మెరుపు వదర కారణంగా అమర్ నాథ్ యాత్రను నిలిపివేశారు. భారీ వరద కారణంగా అమర్ నాథ్ యాత్రికులు మరణించడం పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రధాని మోడీ వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ తో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
కాగా కుటుంబ సభ్యులతో అమర్నాథ్ యాత్రకు వెళ్లిన గోషామహల్ ఎమ్మెల్యే, తెలంగాణ భాజపా శాసనసభాపక్ష నేత రాజాసింగ్లోథ్ విపత్తు ప్రాంతం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.దాదాపు మూడేళ్ల విరామం అమర్నాథ్ యాత్ర గత నెల 30న ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా అమర్ నాథ్ యాత్ర జరగలేదు. దీంతో ఈ ఏడాది పెద్ద సంఖ్యలో యాత్రికులు అమర్ నాథ్ యాత్రకు వచ్చారు. అయితే నిన్నటి నుంచి అమర్ నాథ్ పరిసరాల్లో భారీగా వర్షం పడుతుండటంతో పాటు కొండలపై నుంచి మెరుపు వరదలు ముంచెత్తాయి.


