ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. ప్రయాణీకులు సురక్షితం
Published on: Tue Mar 31, 2026 12:50PM

బస్సు ప్రయాణమంటేనే జనం భయపడేలా తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో మంటలు వ్యాపిస్తున్న సంఘటనలు ఇటీవల సర్వసాధారణమయ్యాయి. తాజాగా విజయవాడ బస్టాండ్ వద్ద ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తత కారణంగా ప్రాణనష్టం సంభవించలేదు.
వివరాల్లోకి వెడితే.. రావుల పాలెం నుంచి హైదరాబాద్ వెడుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో విజయవాడ బస్టాండ్ సమీపంలో ఇంజన్ నుంచి పొగలు వచ్చాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సు నిలిపివేసి ప్రయాణీకులను కిందకు దించేశాడు. ప్రయాణీకులు కిందకు దిగిన నిముషాల వ్యవధిలోనే బస్సులో మంటలు వ్యాపించాయి. ఘటన జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణీకులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.


