ఓఎన్జీసీ రిగ్ వద్ద అగ్నిప్రమాదం.. తప్పిన ముప్పు
Published on: Wed May 27, 2026 12:17PM

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం పరిధిలోని వక్కపట్లవారిపాలెం, భావదేవరపల్లి పంట పొలాల మధ్య ఉన్న నంగేగడ్డ ఓఎన్జీసీ రిగ్ పాయింట్ వద్ద మంగళవారం (మే 26) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పాత రిగ్ ప్రాంతంలో మంటలు ఎలా చెలరేగాయన్నదానిపై స్పష్టత లేదు.
వేసవి ఎండల తీవ్రత కారణమా, పంట పొలాల్లో ఎవరైనా తుక్కు కాల్చడం వల్ల మంటలు వ్యాపించాయా అన్నది తెలియాల్సి ఉంది. కాగా మంటల కారణంగా రిగ్ పరిసరాల్లో ఉన్న చెట్లు దగ్ధమయ్యాయి. పొగ భారీగా వ్యాపించడంతో స్థానిక ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. సమాచారం అందుకున్న అవనిగడ్డ అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.


