ఏపీలోని 'కియా మోటార్స్' లో అగ్ని ప్రమాదం

 

ఏపీలోని అనంతపురం జిల్లా పెనుకొండలో ప్రతిష్టాత్మక కంపెనీ కియా మోటార్స్ ఈ మధ్య ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా కియా మోటార్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. కియా అనుబంధ పరిశ్రమ హ్యుండాయ్‌ డైమోస్‌ కంపెనీలో టెక్నీషియన్లు ట్రయల్‌ రన్‌లో ఒక యంత్రాన్ని పరిశీలిస్తుండగా సిలిండర్‌లోంచి గ్యాస్‌ లీకైంది. నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. వెంటనే మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న చెన్నై నుంచి వచ్చిన టెక్నీషియన్లు పలమవేలు, త్యాగరాజు, ఇటుకలపల్లికి చెందిన హెల్పర్‌ ఆచారి తప్పించుకునేలోపే.. మంటలు చెలరేగడంతో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు అంతర్గత దర్యాప్తుకి ఆదేశించిన కంపెనీ యాజమాన్యం.. రిపోర్టు వచ్చాక, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.