TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేంద్రానికి తడిసి మోపెడు కానున్న ఎరువుల సబ్సిడీ భారం!

Published on: Sat Mar 28, 2026 11:10AM

పశ్చిమాసియాలో నెలకొన్నయుద్ధ పరిస్థితులు, ఉద్రిక్తతలు ఇండియాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా భారత వ్యవసాయరంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.  అంతర్జాతీయ మార్కెట్లో   ధరలు పెరుగుదల.. కేంద్రం  ఇచ్చే ఎరువల సబ్సిడీపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఇది కేంద్రానికి మోయలేని భారంగా పరిణమించే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని  ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ  క్రిసిల్ తాజా నివేదిక  వెల్లడించింది.  క్రిసిల్ అంచనాల మేరకు యుద్ధ ప్రభావంతో కేంద్ర ప్రభుత్వంపై అదనంగా పడే ఎరువుల సబ్సిడీ  పాతిక వేల కోట్లకు మించి ఉంటుంది. 

గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా ఎరువుల తయారీకి అవసరమైన సహజ వాయువు, అమ్మోనియా వంటి వాటి సరఫరా వ్యవస్థలో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి.   భారత్ ఎరువుల అవసరాల కోసం, మరీ ముఖ్యంగా యూరియా తయారీకి అవసరమైన ముడి పదార్థాల కోసం పశ్చిమాసియా దేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో సరఫరా అంతరాయాల కారణంగా దేశంలో ఎరువుల ఉత్పత్తి దాదాపు 15శాతం తగ్గే అవకాశం ఉంది.  వ్యవసాయ సీజన్ సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ పరిణామాలు తీవ్ర ఆందోళనకు తావిస్తున్నాయి.  అంతర్జాతీయ మార్కెట్లో అమ్మోనియా ధరలు ఇప్పటికే దాదాపు పాతిక శాతం పెరిగాయి. ఒకవేళ ఈ ఉద్రిక్తతలు మరి కొంత కాలం కొనసాగితే..  దేశీయ ఎరువుల కంపెనీల ఉత్పత్తి సామర్ధ్యం దాదాపుగా అడుగంటి పోతుంది. అదే సమయంలో నిర్వహణ ఖర్చులూ తడిసిమోపెడౌతాయి. ఇది కంపెనీల లాభాలపై ప్రభావం చూపుతుంది. 

అదలా ఉంటే కేంద్రం  2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ   1.71 లక్షల కోట్లు   ఎరువుల సబ్సిడీ కోసం కేటాయించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ బడ్జెట్ మరో 12 నుండి 15 శాతం పెరిగే అవకాశం ఉందన్నది  క్రిసిల్ అంచనా.  రైతులకు ఎరువుల ధరలు పెరగకుండా చూడాలంటే, పెరిగిన అదనపు భారాన్ని కేంద్రమే భరించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి కేంద్రం  ఇండోనేషియా, మొరాకో, రష్యా వంటి ఇతర దేశాల నుండి దిగుమతులను పెంచుకోవడం ద్వారా కొరతను అధిగమించాలని భావిస్తోంది. ఇక  దేశీయంగా ఉన్న స్టాక్ నిల్వలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా తక్షణ ముప్పును తప్పించే  ప్రయత్నాలూ ప్రారంభించింది.