ఫిజిక్స్ తో రీఎంబర్స్ మెంట్ జిమ్మిక్స్!
Published on: Fri Apr 27, 2012 10:42AM
బిసి. ఇబిసి విద్యార్థులకు చెల్లించే రీ ఎంబర్స్ మెంట్ ఖర్చు నుంచి తప్పించుకోవడం కోసమే ఇంటర్మీడియట్ ఫిజిక్స్ పేపర్ కఠినంగా ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో కేవలం బిసి సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు మాత్రమే ఫీజు రీ ఎంబర్స్ ను ప్రభుత్వం చెల్లించేది. అయితే వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కులాలతో నిమిత్తం లేకుండా తహశీల్దారు నుంచి ఆదాయ ధృవపత్రం సమర్పించిన వారందరికీ ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ఇవ్వడం ప్రారంభించారు.
ధనిక, పేద తేడా లేకుండా అందరూ ఆదాయ ధృవపత్రం సమర్పించి ఫీజు నుంచి మినహాయింపు పొందడం ప్రారంభించారు. దాంతో ప్రభుత్వానికి రీఎంబర్స్ మెంట్ ఖర్చు తలకుమించిన భారంగా మారింది. రీఎంబర్స్ మెంట్ విధానం మార్చాలంటే ఓట్లు పోతాయనే భయంతో ప్రభుత్వం ఖర్చును పరోక్షంగా తగ్గించాలని భావిస్తోందని, అందులో భాగంగానే ఈ ఏడాది నుంచి అర్హతపరీక్షను ఒకేసారి ఉత్తీర్ణులయ్యేవారికి మాత్రమే ఫీజు రీఎంబర్స్ చేసే విధంగా నిబంధనలను మార్పు చేస్తున్నట్టు తెలిసింది.
ప్రభుత్వం ఫిజిక్స్ పేపరు కఠినంగా వుండటం వల్ల ఇతర అన్ని సబ్జెక్టులలో పాస్ అయినప్పటికీ ఫిజిక్స్ లో విద్యార్థులు భారీగా ఫెయిల్ అయ్యారు. దాంతో వీరంతా ఇన్ స్టెంట్ పరీక్ష రాయవలసి వుంటుంది. విద్యార్థులు ఇన్ స్టెంట్ పరీక్షలో ఉత్తీర్ణులైనప్పటికీ ఫీజు రీఎంబర్స్ మెంట్ నిబంధనల్లో మార్పు చేయడం వల్ల వీరు ఫీజు రీఎంబర్స్ మెంట్ పొందే అవకాశం లేకుండా పోతుంది. దాంతో ప్రభుతానికి ఖర్చుతగ్గించుకొనే అవకాశం వస్తుంది. ప్రభుత్వం రీఎంబర్స్ మెంట్ నుంచి తప్పించుకోవడం కోసమే ఫిజిక్స్ పేపరు కఠినంగా ఇచ్చివుంటే మాత్రం క్షమించరాని విషయం అని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.


