TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అధిక బరువుంటే... 'ప్రతీ రోజూ' కడుపు మాడ్చుకోవాల్సిన పని లేదట!

Published on: Wed May 3, 2017 5:45PM

మనకో పాత ఆరోగ్య సూత్రం ప్రచారం లో వుంది! ఒక్కసారి తింటే యోగి, రెండు సార్లు తింటే భోగి, మూడు సార్లు తింటే రోగీ అనీ! ఇది ఎంత వరకూ నిజమో పెద్ద చర్చే కాని… ఉపవాసం మాత్రం మంచిదే! అదీ అధిక బరువున్న వారికైతే మరీ మంచిది! కానీ, తాజా అధ్యయనాలు ఉపవాసంలో కొత్త ట్రెండ్ ఫాలో అవమంటున్నాయి. అది ఇంకా బెటర్ అని చెబుతున్నాయి!

 

ఉపవాసంలో కొత్త ట్రెండ్ అంటే ఏమీ లేదండీ… ప్రతీ రోజూ కడుపు మాడ్చుకోకుండా రోజు వదిలి రోజు కడుపుపై కంట్రోల్ పెట్టాలి అనీ! అవును… గతంలో అయితే వారానికి ఒక రోజో, పదిహేను రోజులకి ఒక సారి ఏ ఏకాదశి వేళనో ఉపవాసం అనేవారు పెద్దలు! ఇప్పుడు శారీరిక వ్యాయామం తగ్గిపోయి అధిక బరువు అధికమందిలో కనిపిస్తుండటంతో ప్రతీ రెండో రోజు ఉపవాసం చేయాలని చెబుతన్నారు!

 

ఒక రోజు కడుపు నిండా తింటే మరో రోజు కడుపు ఖాళీగా వుంచాలి. దీనర్థం నిరాహార దీక్ష చేయమని కాదు. మనకు అవసరమైన కెలోరీల్లో కేవలం 25శాతం మాత్రమే తీసుకోవాలి. అంటే, దాదాపు 500కెలోరీలన్నమాట! ఇక ఉపవాసం చేయని రోజు సగటున 2వేల కెలోరీలు తీసుకోవచ్చు! దీని వల్ల ప్రతీ రోజూ కొసిరి కొసిరి తిన్నదాని కంటే ఎక్కువ ఫలితం వుంటుందని అంటున్నారు రీసెర్చర్స్! వారు ఒక సంవత్సరం పాటూ వందల మంది మీద అధ్యయనం చేసీ మరీ ఈ విషయం చెబుతున్నారు!

 

రోజు వదిలి రోజు ఉపవాసం చేయటం పైకి బాగానే అనిపించినప్పటికీ… ఆచరణలో కష్టమట! చాలా మంది ఉపవాసం వుండాల్సిన రోజున కూడా అవసరానికి మించే తినేసే ప్రమాదం వుంది. ఇక ఈ ఉపవాసం టెక్నిక్ డయాబెటిస్ వున్న వారికి అసలు మంచిది కాదు. ఎందుకంటే, ఎప్పటికప్పుడు కొంత కొంత మోతాదులో తింటూ వుండటం షుగర్ వున్న వారికి అత్యవసరం. లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి అధిక బరువు వున్నవారు నిజంగా తమ పట్టుదలపై తమకు కాన్ఫిడెన్స్ వుంటే … ఈ ఆల్టర్ నేట్ ఫాస్టింగ్ టెక్నిక్ యూజ్ చేయవచ్చు!