TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫార్ములా ఈ రేస్ కేసు.. అన్ని వేళ్లూ కేటీఆర్ వైపే

Published on: Thu Jan 9, 2025 9:57AM

ఫార్ములా ఈ రేస్ కేసులో తన తప్పేమీ లేదనీ, తాను సుద్దపూసననీ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఎంత గట్టిగా చెబుతున్నా.. వేళ్లన్నీ మాత్రం ఆయనవైపే చూపుతున్నాయి. తాను ఆదేశాలు ఇస్తాను.. నిబంధనల మేరకు పనులు చేయాల్సింది అధికారులేనని కేటీఆర్ చెబుతున్నారు కానీ ఆ అధికారులు మాత్రం తమ పైవారు ఏం చెబితే అదే చేశామని చెబుతున్నారు. 

ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ2, ఏ3గా ఉన్న అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలు ఏసీబీ, ఈడీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలాలలో అంతా కేటీఆర్ చేశారనీ, ఆయన ఏం చెబితే అదే తాము చేశామనీ పేర్కొన్నారు.  ఏసీబీ అధికారులు బీఎల్ఎన్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించారు. అయితే విచారణకు ఆయన సహకరించలేదనీ, చీఫ్ ఇంజినీర్ గా తన పాత్ర పరిమితమని చెబుతూ.. పై అధికారులు ఏం చెబితే అదే చేశారనీ బీఎల్ఎన్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది.  

ఇక ఈడీ కేసులో ఐఏఎస్ అర్వింద్ కుమార్ కూడా ఈడీ ఎదుట హాజరయ్యారు. మంత్రిగా ఉన్న కేటీఆర్ చెప్పినట్లుగా చేశానని ఆయన ఎలాంటి శషబిషలూ లేకుండా ఈడీ అధికారుల ఎదుట చెప్పినట్లు తెలుస్తోంది.  కెబినెట్ నిర్ణయాలు, ఆర్థిక శాఖ అనుమతి లేకపోవడం, విదేశీ మారకద్రవ్యం తరలించడం వంటి వ్యవహారాలపై ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించారు.  మొత్తం మీద కేటీఆర్ చెప్పారు.. తాము చేశాం అన్నట్లుగానే ఆ ఇద్దరు అధికారులూ కూడా ఏసీబీ, ఈడీ విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద అధికారులను ఇరికించి తాను తప్పించుకుందాని కేటీఆర్ ప్రయత్నిస్తుంటే... అధికారులు తమదేం లేదు.. ఆయన అంటే కేటీఆర్ ఆదేశాల మేరకే నడుచుకున్నాం అని చెబుతున్నారు.