రాయలసీమలో కాంగ్రెస్ నేత దారుణ హత్య

రాయలసీమలో మరో రాజకీయ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చిత్తూరు జిల్లా కె.వి.బి పురం మండలంలోని కస్తూరిబా మోడల్ స్కూల్ సమీపంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజశేఖర్ రెడ్డిని గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఇటుకల బట్టీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఆయనను మాటువేసి కత్తులతో విచక్షణారహితంగా నరికారు. అతని అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మొదట యాసిడ్ పోసి అనంతరం కత్తులతో దారుణంగా నరికిన గుర్తులు కనిపిస్తున్నాయి. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.