TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోదీ, అమిత్ షా వ్యూహాలు.. ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రశ్నార్థకమేనా?

Published on: Mon Jun 22, 2026 5:00PM

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల మనుగడ, జాతీయ స్థాయిలో మోదీ-అమిత్ షా ద్వయం అనుసరిస్తున్న వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో, బలమైన ప్రాంతీయ శక్తులు సైతం కేంద్ర పెద్దల చాణక్యానికి తలవంచక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి తెలంగాణ వరకు ప్రాంతీయ అధినేతల అహంకారం, వ్యూహాత్మక తప్పిదాలు వారి పతనానికి ఏ విధంగా దారితీస్తున్నాయో  తెలుగువన్ వాస్తవ వేదికలో జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ విశ్లేషించారు. 

రాజకీయాల్లో ఎప్పుడైనా పోరాటం ఉండాలని, ఎక్కడైతే రాజీ పడతారో అక్కడే పతనం ప్రారంభమవుతుందని  జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ అన్నారు.  తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన  మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.

పశ్చిమ బెంగాల్ ఉదాహరణను తీసుకుంటే..  మమతా బెనర్జీ బలమైన నాయకురాలైనప్పటికీ, ఇండియా బ్లాక్‌లో ఉంటూనే కాంగ్రెస్, సీపీఎంతో సరైన రీతిలో కలవలేకపోవడం ఓట్ల చీలికకు దారితీసిందని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవడాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలీకృతమైందన్నారు. మమతా బెనర్జీ, చంద్రబాబు, జగన్ ,  కేసీఆర్.. ఎవరైనా సరే ప్రాంతీయ పార్టీల అధిపతుల్లో ఉండే అహంకారమే ఒక్కోసారి వారి సొంత రాజకీయ ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్నారు.

మరోవైపు తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తూ..  బీఆర్ఎస్ తీవ్రమైన నైతిక పతనాన్ని ఎదుర్కొంటోందని విమర్శించారు. గతంలో వచ్చిన టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, నాయకుల ప్రవర్తన ఆ పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు. అదే సమయంలో బీజేపీ సైతం స్థానికంగా అంతర్గత వివాదాలు, నైతిక సమస్యల వల్ల ప్రజల్లో పట్టు కోల్పోయే ప్రమాదంలో పడిందని, దీనివల్ల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.

ఇక జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన వివిధ ఉద్యమాలు, కొత్త శక్తుల ఆవిర్భావంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రదర్శించిన లౌక్యం అద్భుతమని కొనియాడారు. విపక్షాలు లేదా నిరసనకారులు కేంద్ర ప్రభుత్వంపై ఉద్రిక్తతలు సృష్టించి మైలేజ్ పొందాలని చూసిన ప్రతిసారీ, అమిత్ షా   వ్యూహాత్మకంగా వ్యవహరించి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు. అరెస్టులు చేసి అనవసరంగా హీరోలను చేయడం కంటే, చట్టపరమైన వెసులుబాటు కల్పించి వారి వ్యూహాలనే నీరుగార్చడంలో కేంద్రం సఫలమైందని స్పష్టం చేశారు.

రాబోయే రెండేళ్ల కాలం భారత రాజకీయాల్లో అత్యంత కీలకమని, ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని చాటుకోవాలంటే అహంకారాన్ని వీడి ప్రజాక్షేత్రంలో గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కేంద్రంలో మోదీ, అమిత్ షా ద్వయం వేస్తున్న ఎత్తులను చిత్తు చేయకపోతే ప్రాంతీయ శక్తుల మనుగడ మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉందని డోలేంద్ర ప్రసాద్ అన్నారు.