విజయసాయి రెడ్డి రెచ్చగొడుతున్నారు.. చూస్తూ ఊరుకోము: కోడెల

 

వైసీపీ నేత విజయసాయి రెడ్డి రెచ్చగొట్టేలా ట్వీట్లు చేస్తున్నారని టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మండిపడ్డారు. తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలపై కోడెల స్పదించారు. బెదిరించి, కేసులు పెట్టడం సమంజసం కాదన్నారు. తన కుటుంబ సభ్యులపై 7, 8 కేసులు పెట్టారని.. ఇంకా ఎన్నికేసులు పెడతారో తెలియడం లేదన్నారు. తాను కేసులకు భయపడేది లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు. 

స్పీకర్ పదవికి తాను కళంకం తెచ్చానని విజయసాయి రెడ్డి ఆరోపించడం సరికాదన్నారు.బాధితులు బయటకు వచ్చి కోడెల ఫ్యామిలీపై కేసులు పెట్టాలంటూ విజయసాయిరెడ్డి పెట్టే ట్వీట్లు రెచ్చగొట్టేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. 

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఇతర పార్టీల కార్యకర్తలపై దాడులు, దుర్మార్గాలకు పాల్పడలేదని వివరించారు. కానీ ఇప్పుడు టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలు గ్రామాలను విడిచిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేధిస్తే చూస్తూ ఊరుకోమని కోడెల ప్రభుత్వాన్ని హెచ్చరించారు.