మన్మోహన్ కే కోపం తెప్పించిన మోడీ..
posted on Dec 12, 2017 10:09AM
ఎప్పుడూ సైలెంట్ గా ఉండే మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కి కూడా కోపం వచ్చింది. మరి మన్మోహన్ సింగ్ కు అంతలా కోపం తెప్పించింది ఎవరబ్బా అని అనుకుంటున్నారా...? అది ఎవరో కాదు... ప్రస్తుత ప్రధాని మోడీ. ఇంతకీ ఏ విషయంలో మన్మోహన్ సింగ్ కు కోపం వచ్చిందంటే.. పాకిస్థాన్ తో అంటకాగుతున్నారనే అర్ధం వచ్చేలా మోడీ... తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఓ లేఖ విడుదల చేశారు. రాజకీయ లబ్దికోసం మోడీ ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ఆరోపణలు తనను చాలా బాధించాయని ఆవేదన వ్యక్తంచేశారు. మోడీ ఈ విషయంపై క్షమాపణ చెప్పి ప్రధానమంత్రి కార్యాలయ హుందాతనాన్ని కాపాడాలని కోరారు
కాగా గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న మోడీ... గుజరాత్ ఎన్నికల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్ కు పాక్ సాయం చేస్తోందని మోడీ ఆరోపించారు. మణిశంకర్ అయ్యర్ ఇంట్లో ఇందుకోసం ఓ భేటీ జరిగిందని, పాక్ మాజీ అధికారులు, నేతలతో పాటు..భారత మాజీ ఉపరాష్ట్రపతి, మాజీ ప్రధాని మన్మోహన్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారని, ఇది అనేక సందేహాలను కలిగిస్తోందని మోడీ వ్యాఖ్యానించారు. మొత్తానికి ఎప్పుడూ మౌనమునిలా ఉన్న మన్మోహన్ సింగ్ కూడా కోపం వచ్చిందంటే పాపం బాగానే ఫీల్ అయినట్టు ఉన్నారు.