TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చనిపోయిందనుకున్న మహిళకు తిరిగి ప్రాణం.. అంబులెన్స్ కుదుపుతో ఊపిరి..!

Published on: Fri Jul 31, 2026 3:30PM

 

చనిపోయిందని వైద్యులు తేల్చేస్తే.. రోడ్డు గుంత ప్రాణం పోసింది..!

సినిమా కథలను తలపించేలాంటి ఒక నమ్మశక్యం కాని అరుదైన ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించడంతో, కన్నీటిపర్యంతమైన కుటుంబసభ్యులు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే స్వగ్రామానికి తీసుకెళ్తున్న సమయంలో అంబులెన్స్ రోడ్డు గుంతలో పడటంతో ఊహించని అద్భుతం జరిగింది.

ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబలపట్నం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గురజాల రామతులసి కొంతకాలంగా తీవ్రమైన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆమెను ఏలూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు వెంటిలేటర్, సీపీఆర్ సహా ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

పల్స్ పూర్తిగా పడిపోవడంతో ఆమె కన్నుమూశారని వైద్యులు వెల్లడించారు. దీంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన కుటుంబసభ్యులు, పార్థివదేహాన్ని అంబులెన్స్‌లో గ్రామానికి తరలించేందుకు సిద్ధమయ్యారు. గ్రామంలో అప్పటికే దహన సంస్కారాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. బంధువులు, శ్రేయోభిలాషులు కడసారి చూపు కోసం వేచి ఉండగా, సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.

పార్థివదేహాన్ని తీసుకుని అంబులెన్స్ మండవల్లి మండలం పులపర్రు వద్దకు చేరుకున్న సమయంలో ఓ ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి రోడ్డుపై ఉన్న పెద్ద గుంతలోకి దిగబడింది. ఆ క్షణంలో వాహనం తీవ్రమైన కుదుపునకు గురైంది. అనూహ్యంగా, శవంగా పడి ఉన్న రామతులసి శరీరంలో ఒక్కసారిగా చలనం వచ్చింది.

ఆమె కదలడాన్ని గమనించిన బంధువులు క్షణం పాటు ఆశ్చర్యపోయారు. వెంకటేశ్వరస్వామి దయతో ప్రాణం తిరిగొచ్చిందని గ్రహించి వెంటనే వాహనాన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాణపాయ స్థితిలో ఉన్న ఆమెను మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి పంపించారు.

విజయవాడ ఆసుపత్రి అత్యవసర విభాగం వైద్యులు వెంటనే వైద్యం అందించారు. సుదీర్ఘ చికిత్స తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగుపడటంతో ఐసీయూలో పర్యవేక్షణలో ఉంచారు. వైద్యుల శ్రమ ఫలితంగా ఆమె ప్రాణాలతో బయటపడటంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ వింత ఘటన తెలియగానే గ్రామంలో ఏర్పాటు చేసిన నివాళి ఫ్లెక్సీలను, సోషల్ మీడియా పోస్టులను వెంటనే తొలగించారు. రోడ్డు గుంతే ఆమెకు పునర్జన్మ నిచ్చిందని స్థానికులు ముక్తకంఠంతో చర్చించుకుంటున్నారు.

వైద్య విజ్ఞానానికి సైతం సవాలు విసిరే ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చనిపోయిందనుకున్న మహిళ పునర్జన్మ ఎత్తడంతో ఆ కుటుంబంలో మళ్లీ సంతోషాలు వికసించగా, జిల్లా వ్యాప్తంగా ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.

Eluru strange incident, former sarpanch Ramathulasi, ambulance road pothole, deceased woman, Eluru latest news