TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం.. 16 వేల ఈ-సైకిళ్ల పంపిణీకి చంద్రబాబు ఆదేశం

Published on: Tue May 19, 2026 9:46AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రతి సమస్యకూ తనదైన శైలిలో పరిష్కారాలు కనుగొంటారు. సంక్షోభంలో కూడా అవకాశాలు సృష్టించుకోవాలని పదే పదే చెప్పే ఆయన ప్రస్తుత ఇంధన సంక్షోభ పరిస్థితిని కూడా రాష్ట్రంలో ఈవీల(ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగాన్ని పెంచేందుకు అందివచ్చిన అవకాశంగా అభివర్ణిస్తున్నారు. 

ప్రస్తుత తరుణంలో పెరుగుతున్న ఇంధన ఖర్చులను నియంత్రించడం, పర్యావరణాన్ని కాపాడటం ప్రధాన లక్ష్యంగా చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం  సరికొత్త వ్యూహాలకు పదునుపెట్టి  అమలు చేస్తోంది. ఈ క్రమంలో  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంధన పొదుపు దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ఒక ఉద్యమస్థాయిలో ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.

సచివాలయంలో ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో..  ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి ఈవీ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్రంలోని స్వర్ణ గ్రామ,  స్వర్ణ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి   16 వేల ఎలక్ట్రిక్ సైకిళ్లను అందజేయాలని లక్ష్య నిర్దేశం చేశారు. 

ఈవీ వాహనాల వినియోగాన్ని సామాన్యులకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలను సులభతరంగా కొనుగోలు చేసేలా రుణాలు అందించడానికి ఒక ప్రత్యేక స్పెషల్ పర్పస్ వెహికల్  (ఎస్పీవీ) ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో  బ్యాంకుల సమన్వయంతో   ఈఎంఐ పద్ధతిలో వాహనాలను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కేవలం వాహనాల పంపిణీకే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ల వంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించాలని సీఎం చెప్పారు. ఈ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన భరోసానిచ్చారు.

పర్యావరణహితమైన ఈవీ వాహనాలను ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో ఇంధన వినియోగం గణనీయంగా తగ్గుతుందని చంద్రబాబుసర్కార్ భావిస్తోంది. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ యంత్రాంగంలో ఒక సానుకూల మార్పు రావడంతో పాటు, సామాన్య ప్రజల్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి పెరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. . త్వరలోనే ఈ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో  పట్టాలెక్కించేందుకు అధికారులు చర్యలు ఆరంభించారు.