అప్పుడు 23 తో వైసీపీకి షాకిచ్చింది.. ఇప్పుడు అదే 23 తో చతికిల పడింది..

మే 23 న ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ కేవలం 23 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని ఘోర పరాజయం చవి చూసింది. అయితే టీడీపీకి, 23కి ఏదో తెలియని అవినాభావ సంబంధం ఉందనిపిస్తోంది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కి 2014 లో తొలిసారిగా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో  టీడీపీకి 103 , వైసీపీకి 66 , బీజేపీకి 4, ఇద్దరు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల్లో సుమారు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఈ విషయమై వైసీపీ స్పీకర్ కి కూడా ఫిర్యాదు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ చేతిలో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. టీడీపీ కేవలం 23 ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మరో విచిత్రం ఏంటంటే ఎన్నికల ఫలితాలు కూడ మే 23వ తేదీనే వెలువడ్డాయి. అప్పుడు 23 ఎమ్మెల్యే లను చేర్చుకొని టీడీపీ వైసీపీకి షాకిస్తే.. ఇప్పుడు వైసీపీ టీడీపీని కేవలం 23 ఎమ్మెల్యే లకు పరిమితం చేసి అంతకు పదింతలు షాక్ ఇచ్చింది.