తెలంగాణా ఎంపిల సస్పెన్షన్ వెనుక ఎత్తుగడ ఏమిటి?
Published on: Wed Apr 25, 2012 11:10AM
లోక్ సభలో ప్రత్యేక తెలంగాణా కోరుతూ నినాదాలు చేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలను నాలుగురోజులపాటు సస్పెండ్ చేయడంపై తెలంగాణా ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. లోక్ సభలో తెలంగాణపై నినాదాలు చేయడం, గందరగోళం సృష్టించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక పర్యాయాలు ఇటువంటి ఆందోళనలు చోటుచేసుకున్నప్పటికీ ఏనాడూ సస్పెండ్ కు గురికాలేదు.
తెలంగాణా అంశంపై తొలిసారి అందులోనూ అధికార పార్టీకి చెందిన సభ్యులను సభనుంచి నాలుగురోజులపాటు బహిష్కరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అధికారంలో వున్న పార్టీ తన సభ్యులను తాను సస్పెండ్ చేయడం ఇదే ప్రధమమని చెబుతున్నారు. అధికారపార్టీ సభ్యుల సస్పెండ్ వెనుక బలీయమైన రాజకీయ ఎత్తుగడ వున్నట్టుగా భావిస్తున్నారు. ఇప్పటివరకూ తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న పార్టీగా తెలంగాణా రాష్ట్ర సమితి మాత్రమే గుర్తింపు పొందింది. ఈ స్థితిలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా అందుకు సంబంధించిన ఘనత అంతా టి.ఆర్.ఎస్. పార్టీకే దక్కేలా వుంది.
ఈ పరిస్థితి నుంచి బయటపడటంలో భాగంగా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు సస్పెండ్ నకు గురయినట్టు భావిస్తున్నారు. సస్పెండ్ కు గురైన 8 మంది సభ్యులు అధిష్టానానికి అనుకూలంగా వుండేవారు. అయినా వారు లోక్ సభలో రెచ్చిపోవడం, ఆ తర్వాత వారిని నాలుగురోజులపాటు సస్పెండ్ చేయడం వంటి అంశాలు అన్నీ ఎత్తుగడలో భాగంగానే జరిగినట్టు భావిస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ క్రమంగా ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోనున్నట్టుగా అంచనా వేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటునాటికి అందుకు సంబంధించిన ఘనత అంతా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోవడానికి ఈ ఎత్తుగడ బాగా పనిచేస్తుందని భావిస్తున్నారు.


