విషాదం మిగిల్చిన విహార యాత్ర.. ఎనిమిది మంది హైదరాబాదీయులు మృతి
Published on: Fri Jun 3, 2022 6:12PM
సరదాగా వేసవి సెలవులు ఎంజాయి చేయడానికి వెళ్లిన రెండు కుటుంబాలలో పెను విషాదం నెలకొంది. హైదరాబాద్ నుంచి గోవాకు ఒక ప్రైవేటు ట్రావెల్స బస్సు మాట్లాడుకుని రెండు కుటుంబాలకు చెందిన 32 మంది గోవా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆనందంగా ఉత్సాహంగా గడిపి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే తిరుగు ప్రయాణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు.
దీంతో విహార యాత్ర కాస్తా విషాదంగా మారిపోయింది. తిరుగు ప్రయాణంలో కర్నాటకలోని కలబురిగి వద్ద వీరు ప్రయాణిస్తున్న బస్సు ఎదురుగా వస్తున్న మినీ లారీని ఢీకొని కల్వర్టులో పడిపోయింది. వెంటనే బస్సు మంటల్లో చిక్కుకుంది.
ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఎనిమిది మంది మరణించారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో 12 మంది అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.


