అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ పై క్షేత్రస్ధాయి దర్యాప్తుకు రంగం సిద్ధం చేస్తున్న ఈడీ...

 

 

ఏపీ రాజదాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీఐడీ ఇప్పటికే పలు కేసులు నమోదు చేయగా.. సీఐడీ రాసిన లేఖ మేరకు నెలాఖరులోగా ఈ మొత్తం వ్యవహారంపై క్షేత్రస్ధాయి దర్యాప్తు చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది. ఈ మేరకు సీఐడీ అధికారులకు సమాచారం కూడా ఇచ్చింది. అమరావతి భూసేకరణ సమయంలో జరిగిన పలు లావాదేవీలు మనీలాండరింగ్, ఫెమా చట్టాల పరిధిలోకి వస్తుందని భావిస్తున్న ఈడీ ఈ మేరకు పూర్తిస్ధాయిలో దర్యాప్తు కోసం ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. 

రాజధాని అమరావతిలో భూసమీకరణ సందర్భంగా పలు అక్రమాలు జరిగినట్లు భావిస్తున్న ఏపీ సర్కారు సీఐడీ అధికారులను రంగంలోకి దింపింది. ఇప్పటికే మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణతో పాటు దాదాపు 800 మందిపై కేసులు నమోదు చేసిన సీఐడీ అధికారులు తదుపరి దర్యాప్తు కోసం ఈడీ, ఐటీ విభాగాలకు లేఖలు రాశారు. సీఐడీ లేఖపై స్పందించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అదికారులు అమరావతి భూసేకరణ, అందులో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారాలపై ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెలాఖరులోగా క్షేత్రస్ధాయి దర్యాప్తు కోసం ఏపీకి ఈడీ అదికారులు రానున్నారు. అమరావతిలో జరిగిన లావాదేవీలపై ప్రాథమిక ఆధారాలతో ఇప్పటికే ప్రివెన్షన్ ఆప్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)-2002, ఫారిన్ ఎక్ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ (ఫెమా)-1999 కింద కేసులు నమోదు చేసిన ఈడీ.. మరిన్ని కీలక ఆధారాల కోసం క్షేత్రస్ధాయి దర్యాప్తుకు సిద్దమవుతోంది. 

హైదరాబాద్ లోని ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం క్షేత్రస్ధాయి దర్యాప్తుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. రాజధానిలో పెద్ద ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని సీఐడీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రాథమికంగా దర్యాప్తు చేపడుతున్న అదికారులు తదుపరి దర్యాప్తుపై దృష్టిసారించారు. ముఖ్యంగా స్ధానికంగా ఉన్న కొందరు తెల్ల రేషన్ కార్డు దారులు విలువైన భూములు ఎలా కొన్నారో తెలుసుకునేందుకు ముందుగా ఈడీ ప్రయత్నిస్తోంది. అప్పట్లో అమరావతి, పెదకాకాని, తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి గ్రామాల్లో 797 మంది తెల్లరేషన్‌ కార్డుదారులు 761.34 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు సీఐడీ అధికారులు ఈడీకి ఆధారాలు అందజేశారు. పేద వర్గాలుగా తెల్లకార్డులు పొందిన వారు దాదాపు రూ.276 కోట్లు పెట్టి ఆ భూములు ఎలా కొన్నారనే దానిపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. కొందరు టీడపీ నేతలకు బినామీలుగా ఉన్న తెల్లకార్డుదారులే ఈ భూములు కొన్నట్టు నిర్ధారణ కావడంతో ఇందులో మనీ ల్యాండరింగ్, అక్రమ ఆదాయం వంటి అంశాలు ముడిపడి ఉన్నాయని ఈడీ నిర్ధారించింది. రూ.కోట్లతో కొనుగోలు చేసిన భూముల వివరాలు, వారి ఆర్థిక పరిస్థితి, వారు ఎవరికి బినామీలు తదితర కోణాల్లో ఈడీ కూపీలాగుతోంది. రికార్డుల పరిశీలన పూర్తయిన అనంతరం ఈడీ అమరావతి ప్రాంతంలో విచారణ ప్రారంభిస్తుందని సీఐడీ అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయి దర్యాప్తునకు ముందే సీఐడీ అధికారుల బృందంతో ఈడీ ఉమ్మడి సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోగా ఈడీ, సీఐడీ ఉమ్మడి సమావేశం ఉంటుందని అధికారులు ధ్రువీకరించారు.