‘పీఎం నరేంద్ర మోదీ’కి ఈసీ బ్రేక్

 

ప్రధాని మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘పీఎం నరేంద్ర మోదీ’ చిత్రానికి కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేవరకూ సినిమాను విడుదల చేయకూడదని ఆదేశించింది. ఈ చిత్రం వల్ల క్షేత్ర స్థాయిలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఈసీ తెలిపింది. దీంతో ఈ నెల 11 న విడుదల కావాల్సిన ఈ చిత్రం విడుదల నిలిచిపోయింది.

ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలన్న దానిపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోబోమనీ.. ఎన్నికల సంఘమే దీన్ని పరిష్కరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మోదీ బయోపిక్ కారణంగా ఏదైనా రాజకీయ పార్టీకి లాభమో కాదో కూడా ఈసీనే తేల్చాలని పేర్కొంది. ఎన్నికలు సమీపిస్తున్నందున సాధ్యమైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఈసీని సుప్రీం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ‘పీఎం నరేంద్రమోదీ’ చిత్ర నిర్మాతలకు, బీజేపీకి ఈసీ నోటీసులు జారీ చేసింది. నిర్మాతలు, బీజేపీ నుంచి వివరణ తీసుకున్న అనంతరం సినిమా విడుదల నిలిపివేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు ‘పీఎం నరేంద్రమోదీ’ సహా ఎలాంటి బయోపిక్‌లు విడుదల చేయరాదని ఈసీ ఆదేశించింది. రాజకీయ పార్టీలకు గానీ, వ్యక్తులకు గానీ ప్రచారం చేకూర్చే ఏ బయోపిక్‌లూ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రదర్శించకూడదు అని ఈసీ స్పష్టం చేసింది.