నెల్లూరు జిల్లాలో కంపించిన భూమి
Published on: Wed Jul 13, 2022 3:46PM
ఒక పక్క వానలు, వరదలతో అతలాకుతలం అవుతుంటే మరో పక్క భూమి కంపించి జనాలను భయభ్రాంతులను చేసింది. నెల్లూరు జిల్లాలో భూమి కంపించింది. బుధవారం ఉదయం నెల్లూరు జిల్లాలో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు.
ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. నెల్లూరు జిల్లాలోని నాలుగు మండలాల్లో భూ ప్రపంకపల ప్రభావం కనిపించింది. జిల్లాలోని నాలుగు మండలాలలో భూమి కంపించిందని అధికారులు ధృవీకరించారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది.
దుత్తలూరు, వింజమూరు, వరికుంటపాడు మర్రిపాడు మండలాల్లో భూమి కంపించింది. మూడు నుంచి ఐదు సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూ కంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్ఠం సంభవించలేదని అధికారులు తెలిపారు. గతంలోనూ పలుసార్లు నెల్లూరు జిల్లాలో పలుసార్లు భూమి కంపించింది. వరుసగా వస్తున్న ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు.


