వర్షాల ప్రభావం- తెలంగాణ ఎంసెట్ వాయిదా
Published on: Wed Jul 13, 2022 4:34PM
తెలంగాణలో కుండపోత వర్షాల నేపథ్యంలో ఎంసెట్ పరీక్షలను వాయిదా వేస్తూ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా గురు, శుక్రవారాల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.
వాయిదా పడిన పరీక్షల తేదీలను తరువాత ఖరారు చేస్తామని తెలిపింది. అయితే, అదే సమయంలో ఈ నెల 18,19, 20 న జరగాల్సిన ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు మాత్రం యథావిధిగా జరుగుతాయని ఒక ప్రకటనలో పేర్కొంది.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ ,18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే వారం రోజులుగా కురుస్తున్న ఎ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికీ ఎంసెట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు పూర్తి కాలేదు.
ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారనీ, ఎంసెట్ ను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్ ను పరిగణనలోనికి తీసుకుని గురు, శుక్రవారాల్లో జరగాల్సిన ఎంసెట్ పరీక్షలను ఉన్నత విద్యా మండలి వాయిదా వేసింది.


