మా కౌన్సిలింగ్.. మా ఇష్టం.. కుదురుతుందా?


ఉన్నత విద్యామండలి ఆగస్టు ఏడు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ విద్యాసంస్థలు కౌన్సిలింగ్‌లో పాల్గొనరాదని ప్రకటించింది. తెలంగాణ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తెలంగాణ రాష్ట్రం సొంతగా కౌన్సిలింగ్ నిర్వహిస్తుందని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో పట్టుదలగా వ్యవహరిస్తూ వుండటం పట్ల తెలంగాణ ప్రాంత విద్యార్థులలో ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం మాట విని కౌన్సిలింగ్‌కి వెళ్ళకుండా వుంటే తర్వాత తమ పరిస్థితి ఎలా వుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. చాలామంది తెలంగాణ విద్యార్థులు ఈ టెన్షన్ తమకు ఎందుకని కౌన్సిలింగ్‌కి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు పట్టుదలగా వ్యవహరించి తర్వాత మా కౌన్సిలింగ్ మేం చేసుకుంటాం, మా ఉన్నత విద్యామండలి మేం ఏర్పాటు చేసుకుంటాం అంటే చట్టపరంగా కుదురుతుందో కుదరదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.