TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీచ్ లో కునుకు.. కాలిఫోర్నియా సముద్రంలో కొట్టుకుపోయిన ఇద్దరు ఇండియన్ విద్యార్థినులు

Published on: Wed Jun 17, 2026 10:51AM


అమెరికాలో జరిగిన విషాద ఘటనలో ఇద్దరు ఇండియన్ విద్యార్థినులు బలయ్యారు. . కాలిఫోర్నియాలోని శాంటాక్రూజ్ కౌంటీ  సముద్ర తీరంలో  ఈ విషాదం చోటు చేసుకుంది. అగ్రరాజ్యంలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు  వీకెండ్ ట్రిప్ కోసం బీచ్ కు వెళ్లి సముద్రంలో మునిగిపోయారు.  

మృతులను కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్ నగరానికి చెందిన 21 ఏళ్ల హర్షిత నాయర్  20 ఏళ్ల మహియాల్ శ్రాన్  గా గుర్తించారు. వీరిద్దరూ ఫ్రీమాంట్‌లోని వాషింగ్టన్ హైస్కూల్‌లో 2023లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నాటి నుండి  మంచి స్నేహితులు. ప్రస్తుతం హర్షిత నాయర్ ప్రతిష్టాత్మక యూసీ బెర్క్లీ యూనివర్సిటీలో లీగల్ స్టడీస్ చదువుతుండగా, మహియాల్ శ్రాన్ శాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీలో పబ్లిక్ హెల్త్ విద్యార్థినిగా ఉన్నారు. సెలవు దినాన్ని ఆనందంగా గడపడానికి వెళ్లిన ఈ ఇద్దరు బీచ్ కు వెళ్లారు.

ఈ నెల 10న పాంథర్ బీచ్ లో కీ హోల్ అనే  సహజ రాతి గుహ ద్వారం వద్ద వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రయాణ అలసట వల్ల  చిన్న కునుకు తీశారు. అయితే.. ఆ  సమయంలో, సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది. రాకాసి అలలు, తీరంలో నిద్రిస్తున్న హర్షిత, మహియాల్‌లను క్షణాల్లో సముద్ర గర్భంలోకి లాగేశాయి. ఈ ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న కాల్ ఫైర్, స్టేట్ పార్క్స్ మరియు స్థానిక అగ్నిమాపక విభాగానికి చెందిన  రెస్క్యూ స్విమ్మర్లు అత్యంత వేగంగా రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.

రాతి కొండలు, ఉధృతమైన అలల మధ్య సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎంతో సవాలుతో కూడుకున్నది. రెస్క్యూ సిబ్బంది ఒక యువతిని హెలికాప్టర్ ద్వారా, మరొకరిని స్టోక్స్ బాస్కెట్ సాయంతో తీవ్ర శ్రమకోర్చి ఒడ్డుకు తీసుకువచ్చారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. అయితే, దురదృష్టవశాత్తూ చికిత్స పొందుతూ హర్షిత నాయర్ ఈ నెల 11న మరణించగా, ప్రాణాలతో పోరాడిన మహియాల్ శ్రాన్ ఆదివారం (జూన్ 15)  కన్నుమూసింది.