మా మొహాలకి అంత సీను లేదా? గుత్తా జ్వాల ఆవేదన...

 

భారత క్రీడారంగంలో బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారుల విషయంలో వివక్ష చూపిస్తున్నారని బ్మాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ఆగ్రహం వ్యక్తం చేసింది. సింగిల్స్ ఆడే క్రీడాకారిణులకు ఉన్నంత గుర్తింపు డబుల్స్ ఆదే క్రీడాకారిణులకు లేదని ఆమె నిష్ఠూరంగా అన్నారు. మొన్నీమధ్య ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో గుత్తా జ్వాల, అశ్వని పొన్నప్ప జోడీ రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. సింగిల్స్ ఆడే వారికి ఆర్థికంగా, అన్ని రకాలుగా గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తున్నాయని, అదే డబుల్స్ ఆడేవారి విషయంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా వుందని ఆమె అన్నారు. తగినంత ఆర్థిక సాయంగానీ, గుర్తింపుగానీ లభించని కారణంగా యువతరం డబుల్స్ విభాగంలో ఆడేందుకు వెనుకంజ వేస్తున్నదని గుత్తా జ్వాల అభిప్రాయపడింది. తమకు గుర్తింపు మినహా దేశ ప్రజల నుంచి మరేమీ అవసరం లేదని చెప్పింది. సింగిల్స్ ఆడేవారికి, డబుల్స్ ఆడేవారికి ఆర్థిక ప్రయోజనాల విషయంలో వున్న తేడాని జ్వాల ఈ సందర్భంగా లెక్కలతో సహా వివరించింది.