గ్రూపులు కట్టొద్దు.. ప్రజా సమస్యలపై పోరాటాలు మొదలెట్టు
Published on: Wed Jun 8, 2022 10:40AM
పని తీరులో మార్పు వచ్చి తీరాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. నెల రోజులలో సమూల మార్పు రావాలని ఆదేశించారు. పార్టీలో ఇక గ్రూపులు కనిపించకూడదనీ, కేవలం ప్రజా సమస్యలపై పోరాటాలే కనిపించాలని స్పష్టమైన సందేశం ఇచ్చారు. పార్టీ పటిష్టత, ఇంచార్జ్ ల పనితీరుపై చంద్రబాబు చేస్తున్న వరుస సమీక్షల్లో భాగంగా ఉత్తరాంధ్రలోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలపై చేసిన రివ్యూలో, నియోజకవర్గ స్థాయిలో వివిధ విభాగాల్లో ఉన్న పార్టీ కమిటీల నియామకం పూర్తి చెయ్యాలని చంద్రబాబు అదేశించారు.
వీటితో పాటు ప్రజా సమస్యలపై స్పష్టమైన కార్యాచరణతో పోరాటాలుచేపట్టాలని సూచించారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో పార్టీ లో గ్రూపులు కనిపించకూడదని...ప్రజా సమస్యలపై నేతల పోరాటాలు, పార్టీ కార్యక్రమాలు మాత్రమే కనిపించాలని విస్పష్టమైన సందేశం ఇచ్చారు. ప్రజా సమస్యలపై రోడ్డెక్కని నేతలు....పని చేయని నాయకుల విషయంలో ఉన్నది ఉన్నట్లు తనకు నివేదికల ద్వారా తెలపాలని పార్లమెంట్ కో కోఆర్డినేటర్లకు చంద్రబాబు సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో శ్రీకాకుళం- విజయనగరం, విశాఖపట్నం-అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలపై జరిపిన సమీక్షలో చంద్రబాబు శ్రీకాకుళం- విజయనగరం పార్లమెంట్ల కోఆర్డినేటర్ గా ఉన్న ఎమ్మెల్యే గణబాబు, విశాఖ- అనకాపల్లి పార్లమెంట్ల కో ఆర్డినేటర్ గా ఉన్న మాజీ మంత్రి చిన రాజప్ప లతో విడివిడిగా చర్చించారు.
తరువాత జోన్ 1 ఇంచార్జ్ బుద్దా వెంకన్నతో చర్చించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే నేతల విషయంలోనూ పార్టీ క్యాడర్ ను పట్టించుకోని నేతల విషయంలో కఠిన నిర్ణయాలు ఉంటాయని కుండబద్దలు కొట్టారు. నేతల పనితీరుపై లోతైన సమాచారంతో నివేదికలు ఇవ్వాలని చంద్రబాబు సమీక్షల సందర్భంగా నేతలకు ఆదేశించారు.
15 రోజుల పాటు పార్లమెంట్ కో ఆర్డినేటర్లు క్షేత్ర స్థాయి పర్యటనలు జరపాలని సూచించారు. గ్రూపు రాజకీయాలతో పార్టీకి నష్టం చేసే వారిని ఉపేక్షించేది చెప్పిన చంద్రబాబు ఇంచార్జ్ ల విషయంలో కూడా వారి పనితీరును మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటామని విస్పష్టంగా తేల్చి చెప్పారు.


