భారత్ కి షాక్.. ట్రంప్ దెబ్బ మాములుగా లేదు

చైనాలో మొదలైన కరోనా వైరస్ దెబ్బకి ఓ వైపు ప్రపంచ దేశాలు హడలిపోతుంటే, మరోవైపు ఆ కరోనా వైరస్ అటు తిరిగి ఇటు తిరిగి చైనా మీద కూడా గట్టిగానే ప్రభావం చూపుతోంది. కరోనా దెబ్బకి చైనాలోని కంపెనీలు ఇతర దేశాలకు తరలిపోవాలని చూస్తున్నాయి. ఇదే సదావకాశంగా భావించిన ప్రధాని మోడీ ఆ కంపెనీలను భారత్‌ వైపు ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే మోదీ చేస్తున్న ప్రయత్నాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నీళ్లు చల్లుతున్నారు. చైనా నుంచి తమ తయారీ కేంద్రాలను అమెరికాకు తరలిస్తే పన్ను రాయితీలు ఉంటాయని ఆశ చూపిస్తున్నారు. అలా కాకుండా భారత్‌, ఐర్లాండ్‌ వంటి దేశాలకు తరలిస్తే ఆయా కంపెనీలపై కొత్త పన్నులు విధిస్తామని హెచ్చరిస్తున్నారు.

కరోనా దెబ్బకి చైనా కేంద్రంగా ఉత్పత్తి కార్యకలాపాలు చేపడుతున్న అమెరికా తదితర దేశాల కంపెనీలు ఇతర దేశాలకు వెళ్లాలన్న యోచనలో ఉన్నాయి. వాటిలో యాపిల్‌ వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికా ఎత్తులు వేయడం మొదలుపెట్టింది. తమ మాన్యుఫ్యాక్చరింగ్‌ కేంద్రాలతో తిరిగి వచ్చే కంపెనీలకు పన్ను అనేది ప్రోత్సాహకం అవుతుందని ట్రంప్‌ చెప్పారు. అంతేకాదు ఆయన కంపెనీలను అమెరికాకు రప్పించడం కోసం ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌’ అజెండాతో ట్రంప్‌ చర్యలకు ఉపక్రమిస్తున్నారు. అమెరికన్‌ కంపెనీలను తిరిగి తమ దేశానికి రప్పించుకోవడానికి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి బదులుగా వేరే దేశానికి వెళితే పన్ను విధించాలని చూస్తున్నారు. మొత్తానికి బ్రతిమాలో, భయపెట్టో ఎలాగైనా అమెరికా కంపెనీలను తిరిగి తమ దేశానికి తీసుకెళ్లాలని ట్రంప్ నానా ప్రయత్నాలు చేస్తున్నారు.